సెకండ్ కోవిడ్ వేవ్ ఆర్ధిక వృద్ధికి చేటు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, పరిస్థితి మెరుదలను బట్టి నిర్ణయాలు
సెకండ్ కోవిడ్ వేవ్ దేశ ఆర్ధిక వృద్ధికి చేటు అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అంటున్నారు. ఈ కేసుల నేపథ్యంలో తాము తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్నారు.
సెకండ్ కోవిడ్ వేవ్ దేశ ఆర్ధిక వృద్ధికి చేటు అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అంటున్నారు. ఈ కేసుల నేపథ్యంలో తాము తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్నారు. పరిస్థితి మెరుగుదలను బట్టి ఆర్థిక వృద్ధి కోసం మేం చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. (ఈయన ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ దిశగా పలు ప్రతిపాదనలను రూపొందించింది). రోజువారీ కరోనా వైరస్ కేసులు తామరతంపరగా పెరిగిపోవడం, పలు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించిన నేపథ్యంలో..దీని ప్రభావం ఆర్ధిక వృద్ధిపై పడిందని, పరిస్థితి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చునని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టిమెంట్లు తగ్గడం, వినియోగం, పెరుగుదలలోనూ జాప్యం, మాంద్యం వంటి పరిణామాలు సాధారణ పరిస్థితి పునరుధ్దరణకు రిస్క్ గా మారాయని ఆయన చెప్పారు. ఇండియన్ ఎకానమీని మళ్ళీ గాడిన పెట్టడానికి ఓ వైపు అన్ని ప్రయత్నాలు జరుగుతుండగా ..మరోవైపు కోవిడ్ కేసులు పెరిపోవడం పెను సవాల్ ని సృష్టించిందని ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్ళీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తున్నారని ఆయన అన్నారు.
ఎకానమీ రికవరీకి కొన్ని ప్రతిపాదనలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆరుగురు సభ్యుల పాలసీ కమిటీలోని మృదుల్ సాగర్, అషిమా గోయెల్, శశాంక భీడే, ఇతర సభ్యులు రిజర్వ్ బ్యాంకు బ్యాలన్స్ షీట్ ను విస్తృతం చేయాలనీ అభిప్రాయపడ్డారు. దీన్ని విస్తరించిన పక్షంలో ప్రభుత్వం సెక్యూరిటీలను కొనుగోలు చేయగలుగుతుందన్నారు. ద్రవ్యోల్బణాన్నీ అదుపులో ఉంచాలంటే మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖతోనూ సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. మొదట ఈ సెకండ్ కోవిడ్ వేవ్ ప్రభావం తగ్గాల్సి ఉంటుందన్న విషయంలో అంతా ఏకీభవించారు.