AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా.. ఎటు చూసినా అయోమయం.. పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక అవస్థలు!

కరోనా సృష్టిస్తున్న విలయానికి ప్రజలు కకావికలమవుతున్నారు. కనీసం ఆసుపత్రిలో చేరి ప్రాణాలు నిలుపుకుందామా అంటే బెడ్స్‌ కొరత వేధిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా.. ఎటు చూసినా అయోమయం.. పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక అవస్థలు!
Hospitals Struggle With Shortage Of Beds And Oxygen
Balaraju Goud
|

Updated on: Apr 26, 2021 | 2:44 PM

Share

Covid 19 effect: కరోనా సృష్టిస్తున్న విలయానికి ప్రజలు కకావికలమవుతున్నారు. కనీసం ఆసుపత్రిలో చేరి ప్రాణాలు నిలుపుకుందామా అంటే బెడ్స్‌ కొరత వేధిస్తోంది. గతంలో ఎక్కడెక్కడో ఇలాంటి విజువల్స్‌ చూసి అయ్యో పాపం అనుకున్నాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలోనే కళ్లారా అలాంటి సీన్స్ కనిపించి గుండెను పిండేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా… ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి కొరత లేదంటూ ఆన్‌లైన్‌లో లెక్కలు చూపిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఆసుపత్రుల్లో బెడ్స్‌ కొరత ప్రజల ప్రాణాలు హరిస్తోంది. గంటగంటకు రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. బెడ్స్‌ కొరత రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తోంది. కరోనా పేషెంట్లు, రోగుల బంధువులతో ఒంగోలు జిజిహెచ్‌ నిండిపోయింది. కరోనా ఓపి విభాగం దగ్గర బాధితులు బారులు తీరారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో బెడ్లు నిండిపోవడంతో బాధితులు పడిగాపులు పడుతున్నారు. జిజిహెచ్‌లో ఉన్న వెయ్యికి పైగా బెడ్లు బాధితులతో నిండిపోవడంతో కొత్తగా వస్తున్న బాధితులకు బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. 108 వాహనాలు, అంబులెన్స్‌లలో వచ్చే బాధితులు ఎక్కడికక్కడే స్ట్రెచ్చర్లపైనే ఆగిపోవాల్సిన దుస్థితి. ఇలాంటి వారికి ఓపి విభాగంలోనే నేలపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. రోజురోజుకు జిల్లాలో కేసులు పెరిగిపోవడంతో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా బెడ్లు దొరకడం లేదు. ఓ కరోనా పేషెంట్‌ రోజంతా ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు ప్రభుత్వాసుపత్రికి వస్తే అక్కడ కూడా బెడ్లు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడి వెళ్ళాలో అర్ధం కావడం లేదంటూ బాధితులు వాపోతున్నారు.

విజయవాడ జీజీహెచ్‌లో మొత్తం వెయ్యి బెడ్స్‌ ఉన్నాయి. ఐసీయూ, వెంటిలేటర్లలో మొత్తం 150 ఉన్నాయి. అన్ని నిండిపోయాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడకు వస్తున్నారు. శనివారం నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో జాయిన్‌ అయిన తర్వాత కనీసం 10 రోజులు చికిత్స తీసుకోవాలి. అందుకే బెడ్స్‌ ఖాళీ కావడం లేదు. అందరికి బెడ్స్‌ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యేవారు తక్కువగా ఉన్నారు. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆసుపత్రి చికిత్స అవసరం లేని వారు ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే మందుల కిట్‌ తీసుకొని వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటే మందులు క్రమపద్ధతిలో వాడితే సమస్య ఉండదని చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారందరికీ ఆక్సిజన్‌ అవసరం లేదని చెబుతున్నారు. ఏకంగా అయా జిల్లా ప్రధాన ఆసుపత్రుల వద్ద బోర్డులే దర్శనమిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో చూపిస్తున్న లెక్కలకు ఆఫ్‌లైన్‌లో ఉన్న పరిస్థితికి చాలా గ్యాప్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 344 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐసీయూలో 4,283 బెడ్స్‌ ఉంటే అందులో రెండు వేలకుపైగా అందుబాటులో ఉన్నట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. జనరల్‌ బెడ్స్‌ అయిదే ఐదువేల ఐదు వందలకుపైగా ఖాళీగా ఉన్నాయి. వెంటిలేటర్స్‌ బెడ్స్‌ కూడా రెండు వేల ఆరువందలకుపైగా ఖాళీ ఉన్నట్టు సైట్‌లో చూపిస్తున్నాయి. ఫీల్డ్‌ లెవల్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాల్లో ఎక్కడా బెడ్స్‌ లేవనే ఆందోళనలు మిన్నంటాయి.

ఇక, తెలంగాణలోనూ పరిస్థితి అలానే కొనసాగుతోంది. జిల్లాల్లో బెడ్స్‌ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్స్‌ ఖాళీలపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ గణాంకాలకు… వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు.. కొవిడ్‌ రోగులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ పంపిస్తున్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం పడకలకు సంబంధించి అసలు ఏ విషయంలోనూ కొరత లేదు. చాలా ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 45వేల297 పడకలుండగా.. వీటిలో19వేల 536 మాత్రమే నిండాయి. మిగిలిన 25,763 బెడ్స్‌ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. అంటే సగానిపైగా ఖాళీగానే ఉన్నాయని ఈ లెక్కల్లో తెలుస్తోంది. అయినా రోగులు పడకల కోసం పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నది వాస్తవం.

Read Also…  పిల్లలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి.. వైద్యులేమంటున్నారు..?

Follow Us