IPL 2020: పంజాబ్ పాంచ్ పటాకా…
ఐపీఎల్ 2020 ఫస్టాఫ్లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్… సెకండాఫ్లో జోరుమీదుంది. వరుసగా ఐదు విజయాలు సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
KXIP Five Wins Streak: ఐపీఎల్ 2020 ఫస్టాఫ్లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్… సెకండాఫ్లో జోరుమీదుంది. వరుసగా ఐదు విజయాలు సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఓటమి తప్పదనుకున్న ప్రతీ మ్యాచ్లోనూ చివరి బంతి వరకు పోరాడి అద్భుత విజయాలను నమోదు చేసుకుంటోంది. బ్యాటింగ్ విఫలమైతే.. బౌలర్లూ.. బౌలర్లు విఫలమైతే.. బ్యాట్స్మెన్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
అంతేకాదు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పునరాగమనం పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. అలాగే అన్నింటి కంటే మించి ఆ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పోరాడేతత్వం.. కేఎల్ రాహుల్ పట్టు వదలని నాయకత్వం పంజాబ్ జట్టు విజయాల్లో కీలక పాత్రలు పోషించాయని మాజీలు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిగతా జట్ల మాదిరిగానే పంజాబ్ కూడా బలమైన జట్టు. అయితే ఎందుకోగానీ మొదట్లో వారు విజయాలు సాధించడంలో వెనుకబడ్డారు. విజయం చివరి వరకు వచ్చి ఓటమి చవి చూశారు. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వచ్చి ఓడిపోతే.. మరొకటి చివరి బంతికి.. ఇలా ఫస్టాఫ్లో ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడిపోయింది.
అయితే ఓడిపోతున్నాం కదా అని ఆశలు వదులుకోలేదు. ప్లేఆఫ్ బెర్త్పై గురి పెట్టారు. సెకండాఫ్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ వరుసగా విజయాలు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. క్రిస్ గేల్, రాహుల్, మయాంక్, మనదీప్, పూరన్ బ్యాటింగ్లో అదరగొడుతుంటే.. షమీ, జోర్డాన్, బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, మాక్స్వెల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనలు కనబరుస్తున్నారు. ఇక ఇదే ఆటతీరును ఈ జట్టు కొనసాగిస్తే.. మొదటి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.