Revanth Reddy: రిపబ్లిక్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు.. సినిమా చూసిన తర్వాత వంద ప్రశ్నలతో బయటకు వచ్చానన్న టీపీసీసీ అధ్యక్షుడు..
సాయితేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు
Revanth Reddy:
సాయితేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై సూపర్హిట్ టాక్తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు సినీ, రాజకీయ వర్గాలనుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా రిపబ్లిక్ సినిమాను హైదరాబాద్లోని AMB మాల్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూశారు అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘ప్రస్థానం సినిమాను నేను యూఎస్ పర్యటనలో ఉన్నప్పుడు చూశాను. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా సినిమాలు తీస్తాడు దేవ్ కట్టా. చాలా సినిమాలు ఎండ్ కార్డ్ పడ్డాక ఏదో ఒక కంక్లూజన్తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. కానీ మేం మాత్రం వంద ప్రశ్నలు, ఆలోచనలతో బయటకు వచ్చాం అన్నారు. జరిగిన దానికంటే.. చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజాస్వామ్యం మెచ్యూర్ అవ్వాలంటే చేస్తున్న పనుల్లోని లోపాలను సరిదిద్దుకోవాలి. మంచి పాలన అందించేందుకు సరైన నిర్ణయాలను తీసుకోవాలి ఇలాంటివి ఇంకా ఎన్నో… ఈ చిత్రంలో ఒక ప్రాంతంలోని సమస్యను మాత్రమే చూపించి ప్రశ్నలను మాత్రం అన్ని వ్యవస్థలపై వేసినట్టుగా దేవా కట్టా తెరకెక్కించారు అని రేవంత్ రెడ్డి అన్నారు.
సినిమా అనేది నిర్మాతలకు నష్టమో లాభమో అనే కోణంలో నేను చూడలేదు. కానీ ప్రజలకు మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నారు. కొద్ది మందిలోనైనా మార్పు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. దేవ్కట్టా ఓ మంచి సినిమాను తీశారు. దీన్ని యువత చూడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశం మనకు ఏం ఇచ్చిందనే కంటే.. మనం ఏం చేశామని ఆలోచనను రేకెత్తిస్తారు. మన దేశానికి, మన ప్రాంతానికి ఏదైనా ఒక మంచి పని చేయాలి. సినిమాను హీరో హీరోయిన్లు బాగా చేశారు అని చూడటం కంటే.. ఇంకా ఎక్కువ స్థాయిలో సినిమాను చూడాలి. జగపతి బాబు గారు అద్భుతంగా నటించారు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :