Singer Janaki: జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?దిగ్గజ గాయని లైఫ్ లో ఇన్ని ట్విస్టులా?
లెజండరీ సింగర్ జానకమ్మ మరణంతో సంగీత ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె పాటలను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. కాగా జానకమ్మది ప్రేమ వివాహమని చాలా మందికి తెలియదు. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె తన ప్రేమకథ గురించి ఇలా చెప్పుకొచ్చారు.

వేలాది పాటలకు తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారు జానకమ్మ. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గొప్ప గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో నూ పాటలు పాడిన జానకమ్మ (88) శనివారం (జులై 11) కన్నుమూశారు. కాగా జానకమ్మ గాన ప్రస్థానం గురించి అందరికీ తెలుసు. అయితే ఆమె జీవితంలోనూ ఓ అందమైన ప్రేమకథ ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత ‘మీది లవ్ మ్యారేజా’ అని జానకమ్మను అడిగింది. దీనికి లెజెండరీ సింగర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ మాది ప్రేమ వివాహమే. నేను హైదరాబాద్ లో మా మామయ్య చంద్రశేఖర్ దగ్గర ఉండేదాన్ని. ఆయన మేకప్ మార్చుకునే విరామ సమయంలో ప్రేక్షకులను అలరించేందుకు లతా మంగేష్కర్ పాటలు పాడేదాన్ని. ఒక రోజు చంద్రశేఖర్ జేబులో నుంచి మా ఆయన ( రామ్ ప్రసాద్) ఫొటో కింద పడింది. ఆ ఫొటోను ఎవరికీ తెలియకుండా తీసుకుని దాచుకున్నాను. అలా ఫొటో చూసి ఆయనను లవ్ చేశాను. మా ఇద్దరి ఏదో తెలియని అనుబంధం ఉన్నట్లు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత స్వయంగా మా ఆయనే వచ్చి నన్ను కలిశారు. మా మావయ్య ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత నేను పాటలు పాడతానని తెలిసి ‘ఈ అమ్మాయి నాటకాల్లో పాటలు పాడటానికే పరిమితం కాకూడదు. సినిమా రంగంలో అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో దేశం మొత్తం గర్వపడే గాయని అవుతుంది’ అని చెప్పారు. ఆయనకు నా ప్రతి పాటంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా రసిక బలం సాంగ్ అంటే తెగ వినేసేవారు’
‘నేను రికార్డింగ్కు వెళ్తే ఒక్కరోజు కూడా నన్ను ఒంటరిగా పంపే వారు కాదు. ఆయన తన జీవితమంతా నా కోసమే ధారపోశారు. ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు. ఈరోజు కూడా ఆయన నా ఆలోచనల్లో నాతోనే ఉన్నారు ‘ అని చెప్పుకొచ్చారు జానకమ్మ. రామ్ప్రసాద్- జానకమ్మలది ప్రేమ వివాహం. 1959లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. వీరికి మురళీ కృష్ణ అనే కుమారుడు ఉన్నారు. కాగా 1997లో రామ్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఈ ఏడాది జనవరిలో కుమారుడు మురళీ కృష్ణ కన్నుమూశాడు. ఇప్పుడు జానకమ్మ గారు కూడ వారి దగ్గరికే వెళ్లిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




