AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాచ్‌లు పట్టరు.. పరుగులు చేయరు.. బౌలింగ్‌‌లోనూ అట్టర్ ఫ్లాప్.. ఇదే టీం టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తే..?

Team India T20 Crisis: ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత జట్టు ఇలా వరుస సిరీస్‌లలో ఘోర పరాజయాలు మూటగట్టుకోవడం ఒక హెచ్చరిక లాంటిది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికైనా మేల్కొని ఈ లోపాలను సరిదిద్దకపోతే, రాబోయే జింబాబ్వే పర్యటనలోనూ భారత్‌కు అవమానకరమైన ఓటములు తప్పవనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్యాచ్‌లు పట్టరు.. పరుగులు చేయరు.. బౌలింగ్‌‌లోనూ అట్టర్ ఫ్లాప్.. ఇదే టీం టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తే..?
Team India T20 Crisis
Venkata Chari
|

Updated on: Jul 12, 2026 | 12:58 PM

Share

కొన్ని నెలల క్రితమే ప్రపంచంలోని బలమైన జట్లను మట్టికరిపించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన మన టీమిండియా.. ఇంతలోనే పాతాళానికి పడిపోయింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో భారత జట్టు ప్రదర్శించిన అత్యంత నాసిరకమైన ఆటతీరు కోట్లాది మంది అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మైదానంలో కనీస అవగాహన లేని పసికూనల్లా ఆడుతున్న మన ఆటగాళ్ల వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైనప్పుడే మేనేజ్‌మెంట్ కళ్లు తెరవకపోవడం వల్లే ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై పూర్తి వైట్‌వాష్ అవ్వాల్సి వచ్చింది.

చేతులెత్తేసిన బ్యాటింగ్ విభాగం..

ఐర్లాండ్ పర్యటనలో చేసిన తప్పులనే ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ పునరావృతం చేస్తూ భారత్ స్వయంకృతాపరాధంతో మ్యాచ్‌లను చేజార్చుకుంది. ఐర్లాండ్ చేతిలో చరిత్రలో తొలిసారి సిరీస్ (2-0) ఓడిపోయిన మన జట్టు, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో 14 ఏళ్ల తర్వాత మొదటిసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ పతనానికి ప్రధాన కారణం మన బ్యాటర్ల ఘోర వైఫల్యమే. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన ఏ ఒక్క టాప్ ఆర్డర్ బ్యాటర్ కూడా కనీసం ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయారు. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి టీ20 స్పెషలిస్టులు జట్టులో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కోలేక వికెట్లు పారేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Team India: బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!

ఇవి కూడా చదవండి

దిక్కుతోచని బౌలింగ్.. పసలేని వ్యూహాలు..

ఇంగ్లాండ్ బౌలింగ్‌తో పోలిస్తే భారత బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. అర్ష్‌దీప్ సింగ్‌కు విదేశీ గడ్డపై ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, అతను కూడా ఈ పర్యటనలో ప్రభావం చూపలేకపోయాడు. మిగిలిన యువ పేసర్లు, స్పిన్నర్లకు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బంతులు వేసే కనీస విచక్షణ లోపించింది. వికెట్లు తీయడం దేవుడెరుగు, ప్రత్యర్థి బ్యాటర్ల పరుగుల వరదను నియంత్రించడంలో గానీ, వారి భాగస్వామ్యాలను విడదీయడంలో గానీ మన బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ఆరంభంలో వికెట్లు పడినా, మిడిల్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఇంగ్లాండ్‌కు విజయాన్ని కానుకగా ఇచ్చారు.

గల్లీ క్రికెట్‌ను తలపించిన ఫీల్డింగ్ లోపాలు..

ఈ పర్యటనలో భారత జట్టు ప్రదర్శించిన ఫీల్డింగ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని చెప్పాలి. చేతుల్లోకి వచ్చిన సులువైన క్యాచ్‌లను సైతం జారవిడవడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. మైదానంలో కదులుతున్న ఫీల్డర్లను చూస్తే, వీరేనా మొన్నటివరకు ప్రపంచ కప్ గెలిచిన ఛాంపియన్లు అనే అనుమానం కలగక మానదు. బంతి కొంచెం దూరంగా వెళ్తే పరుగెత్తి క్యాచ్ పట్టాలనే కసి ఎక్కడా కనిపించలేదు. ఈ చెత్త ఫీల్డింగ్ కారణంగానే ప్రత్యర్థి బ్యాటర్లు మరింత రెచ్చిపోయి భారీ స్కోర్లు సాధించారు.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

చాకచక్యం లేని అయ్యర్ కెప్టెన్సీ..

తొలిసారి టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ నాయకత్వ లోపాలు ఈ సిరీస్‌లో స్పష్టంగా బయటపడ్డాయి. ఏ సమయంలో ఏ బౌలర్‌ను రంగంలోకి దించాలి, ఫీల్డింగ్‌ను ఎక్కడెక్కడ మోహరించాలి, ప్రత్యర్థి బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలనే విషయాల్లో అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. జట్టు వరుసగా ఓడిపోతున్నా, ఆటగాళ్ల ప్రదర్శనలో కనీస మార్పు కనపడలేదు. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా ఎక్కడా జరిగినట్లు అనిపించలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us