Cyber Frauds: మహిళలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్.. రెచ్చిపోతున్న మాయగాళ్లు..!
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు జనం సొమ్మును దోచేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ మెయిల్స్తో హ్యాకర్ల మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు జనం సొమ్మును దోచేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ మెయిల్స్తో హ్యాకర్ల మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న కూడా ఈ మోసాలు ఆగడం లేదు. మహిళలు, యువత, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్ నంబర్ చెప్పండి.. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ చెప్పండి.. మీ ఏటీఎం పనిచేయడం లేదని, మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపి అకౌంట్ల నుంచి లక్షలు మాయం చేస్తున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్ లను ఆసరా చేసుకుని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈజీ మనీ మీద ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని టెక్నాలజీ సహాయంతో పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేస్తున్నారు. లోన్ యాప్, ఎస్ఎంఎస్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, బిట్ కాయిన్ , క్రిప్టో కరెన్సీ, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సామాన్యులను మోసగిస్తున్నారు. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికి సైబర్ మోసాలకు బ్రేక్ పడటం లేదు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్న ఉదంతాలు ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.
తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మనీ లాండరింగ్ కేసు పేరిట సైబర్ మోసం జరిగింది. పటాన్ చెరు మండలం లక్డారం చెందిన వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 3 లక్షలు డ్రా చేశారు సైబర్ నేరస్థులు. ఇలా సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట ప్రాంతాల్లో ఎక్కువగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ లో ఇటీవలే సైబర్ నేరగాళ్లు సుమారు రూ.57 లక్షలు కాజేశారు. నెల రోజుల క్రితం అమీన్ పూర్ లో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగులకు రెట్టింపు డబ్బు ఆశ చూపిన కేటుగాళ్ళు బురిడీ కొట్టించారు. అధిక డబ్బుకు ఆశపడి ఓ మహిళా రూ.21 లక్షలు, మరో మహిళ రూ.4.6 లక్షలు పోగొట్టుకున్నారు.
అలాగే మరో ఇద్దరు వ్యక్తులను టాస్క్ ల పేరుతో బురిడీ కొట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.1.60 లక్షలు కాజేశారు. బాధితులు1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా, వా వివరాలను పోలీసులు సీక్రెట్గా ఉంచి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నెలన్నర రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరాగాళ్లు ఓ లింక్ పంపితే దాన్ని అతను ఓపెన్ చేసి చూసేసరికి ఐదు నిమిషాల్లో అతని అకౌంట్ లో నుంచి రూ.11లక్షలు మాయమయ్యాయి. నారాయణఖేడ్ లో 20 రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ తనకు వచ్చిన ఫేక్ ఐడీని ఓపెన్ చేసి చూడగా దశలవారీగా రూ.19 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక సిద్దిపేట జిల్లా పరిధిలో కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు..ఈ ఏడాది జనవరి నుంచి మే మొదటి వారం వరకు రూ.40.99 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. జిల్లాలో గత 2 నెలల కాలంలో దాదాపు 270 సైబర్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా, వాటిలో 150 కేసుల్లో పెద్ద మొత్తంలో డబ్బులను ఫ్రీజ్ చేసి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి మీకు రూ.3 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందని చెప్పి దానికోసం ప్రాసెస్ చార్జీ, జీఎస్టీ, ఇన్సూరెన్స్, సిబిల్ స్కోర్ ల కోసం ఖర్చులు ఉంటాయని చెప్పగానే నమ్మిన బాధితుడు రూ.45,570 పంపించాడు. తరువాత సైబర్ మోసగాడు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. దీంతో సైబర్ నేరగాడికి చేరిన అకౌంట్లో ఉన్న రూ.45,570లు ఫ్రీజ్ చేశారు.
ఇక మెదక్ జిల్లాలో కూడా తరచూ సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి.. గతేడాది 27 సైబర్ కేసులు బుక్ అయ్యాయి..గత ఫిబ్రవరి 2వ తేదీన మనోహరాబాద్ మండల కేంద్రంలో నివసిస్తున్న కృష్ణ జిల్లాకు చెందిన యావ శ్రీనివాస్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్చేసి మాయమాటలు చెప్పి ఓ లింక్ పంపారు. అతను లింక్ ఓపెన్ చేయగా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1.75 లక్షలు పోయాయి. గత ఫిబ్రవరి 22 వ తేదీన మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన చెలిమ చంద్రశేఖర్ ఫోన్కు టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి చెప్పారు. అతను ఆ లింక్ ఓపెన్ చేయగా అతని బ్యాంక్ అకౌంట్ లో నుంచి రూ.1.42 లక్షలు పోయాయి.
గత ఏప్రిల్ నెలలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె, కౌడిపల్లికి గ్రామానికి చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.1.05 లక్షలు పోగొట్టుకున్నారు. వెల్మకన్నకు చెందిన బ్యాంక్ మిత్ర విఠల్ రూ.75 వేలు, కౌడిపల్లికి చెందిన మరో బ్యాంక్ మిత్ర శ్రీనివాస్ గౌడ్ రూ.30 వేలు ట్రాన్స్ ఫర్ చేశారు. తర్వాత తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయామని గుర్తించారు.
ఇలా సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం అంటున్నారు పోలీసులు.. మొబైల్కు వచ్చిన లింక్లు, మెసేజ్లు చదవకుండా క్లిక్ చేయవద్దు. అనుకోకుండా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పోతే 1930 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేస్తే సంబంధిత అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారు. పోలీసులను ఆశ్రయించాలి. అనవసర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. వాట్సాప్ నంబర్లకు వచ్చే మెసేజ్లు, సెల్ఫోన్కు వచ్చే మెసేజ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే అనవసర లింకులు ఓపెన్ చేయొద్దు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు. తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు పోలీసులు…
ఇవి పాటిస్తే మంచిది
మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు. అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి. బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉచిత వైఫై ఉపయోగించకపోవడం మంచిది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్లోడ్ చేయకపోవడం ఉత్తమం అంటున్నారు ఎక్స్ఫర్ట్స్.!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..