ఆన్లైన్ మోసాలపై పోలీసు నిఘా.. 392 మొబైల్ సిమ్ కార్డులు డీయాక్టివేట్
పెరిగిపోయిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్ల రూపంలో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు....
పెరిగిపోయిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్ల రూపంలో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఫేక్ గిఫ్ట్లు, ఆఫర్ల పేరిట సైబర్ నేరగాళ్లు స్మార్ట్ గా ప్రజల్ని దోచుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆన్లైన్ మోసగాళ్ల పనిపడుతున్నారు. హర్యానా పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి పొందిన 392 మొబైల్ సిమ్ కార్డులను పోలీసులు డియాక్టివేట్ చేశారు. ఇవన్నీ మే నేల 12 నుంచి జూన్ 15 వరకు అక్రమంగా పొందినట్లు గుర్తించిన పోలీసులు వాటిని డియాక్టివేట్ చేశారు.
ఈ మేరకు అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవదీప్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నట్లు గుర్తించామని, సైబర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు అనంతరం 685 మొబైల్ సిమ్ కార్డులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా జారీ అయినట్లు తేలిందన్నారు. నకిలీ ఐడీ ప్రూఫ్లను సమర్పించి, సిమ్ కార్డులను పొంది, వాటి ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. టెలికమ్యూనికేషన్ల శాఖను సంప్రదించి, 392 మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయించినట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు.