AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migrated Workers: మళ్ళీ ఆనాటి పరిస్థితి పునరావృతం.. రోడ్డున పడుతున్న వలస కార్మికులు.. ఆదుకునే వారేరి?

గత సంవత్సరం కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిన తరువాత జాతీయ స్థాయిలో విధించిన లాక్‌డౌన్ నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ నాటి...

Migrated Workers: మళ్ళీ ఆనాటి పరిస్థితి పునరావృతం.. రోడ్డున పడుతున్న వలస కార్మికులు.. ఆదుకునే వారేరి?
lockdown effect
Rajesh Sharma
|

Updated on: Apr 21, 2021 | 6:30 PM

Share

Migrated Workers again on roads: గత సంవత్సరం కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిన తరువాత జాతీయ స్థాయిలో విధించిన లాక్‌డౌన్ నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ నాటి పరిణామాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పొట్ట చేత పట్టుకొని నగరాలకు వలస వచ్చిన వలస జీవులు తిరిగి మళ్ళీ రహదారుల మీద సొంతూళ్లకు పయనమవుతున్న దృశ్యాలు అందరినీ కలవర పరుస్తున్నాయి.  వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతూ ఉండడంతో  కొన్ని రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్లు,  రాత్రి కర్ఫ్యూలు విధించడం వైపు అడుగులు వేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించేందుకు వెనుకాడితే.. న్యాయస్థానాలు తమదైన శైలిలో స్పందించి మరి లాక్‌డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. అందువల్ల ఉత్పత్తి రంగ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, భవన నిర్మాణ రంగం, చిన్న వ్యాపారాలు పడిపోతున్నాయి, లేదా పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ కారణంగా ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వలస జీవులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిణామాలు చూస్తే వలస జీవుల దుస్థితికి అందరూ కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రమైతే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తారేమో అని వలస జీవులు ఆందోళన చెందుతున్నారు. అందుకే వారు స్వస్థలాలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో  లాక్డౌన్ లేదు కానీ త్వరలోనే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తుండడంతోవ వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వలస జీవులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేవని ప్రకటించినప్పటికీ వలస జీవుల్లో ఆందోళన తగ్గడంలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా లాక్‌డౌన్ విధించబోమని ప్రకటించారు. కానీ వారి ఉపాధి పట్ల ఆందోళన తగ్గడం లేదు. అందుకు కారణం గ్రౌండ్ లెవెల్ వారికి సరైన ఉపాధి దొరక్క పోవడమే. రైళ్లు, బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్ వుండదని ప్రకటిస్తున్నాయి. ఎవరు రోడ్డున పడే పరిస్థితి ఉండదని ప్రభుత్వాధినేతలు హామీ ఇస్తున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. కానీ ఈ ప్రకటనలు వలస జీవుల్లో ఏ మాత్రం విశ్వాసాన్ని పెంచడం లేదు. అందుకే సొంతూళ్ళకు ప్రయాణం అవుతున్నారు. పరిస్థితి చూస్తే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఇంకా పెరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ఉధృతి ఇంకా పెరిగితే ఏ ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలవు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే రోజువారి కూలీలు, కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయి. గత సంవత్సరం మార్చి ఆఖరు వారం నుంచి ఆగస్టు నెల దాకా కొనసాగిన లాక్ డౌన్ కారణంగా వేలాది మంది ఉద్యోగులు, వలస జీవులు రోడ్డున పడ్డారు. తట్టాబుట్టా సర్దుకుని వేలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి సొంతూళ్లకు చేరుకున్నారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ లాంటి కొందరు వలస జీవుల పట్ల తమదైన శైలిలో స్పందించి సాయం అందించారు.

తాజాగా మార్చి ఒకటవ వారం నుంచి కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరం అత్యధికంగా సెప్టెంబర్ నెలలో కరోనా కేసులు నమోదు కాగా ఆనాటి రికార్డును బద్దలు కొట్టి ప్రస్తుతం ప్రతిరోజు రెండు నుంచి మూడు లక్షల దాకా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రాలకు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు, పాక్షిక లాక్ డౌన్ విధిస్తూ ఉన్నాయి ఫలితంగా వలస జీవులు మరోసారి ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. దాంతో స్వస్థలాలకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ వలసలు కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కనబడుతున్నాయి. కానీ పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తే వలస జీవులు మరోసారి పొట్ట చేతపట్టుకుని రహదారుల వెంబడి ప్రయాణం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో పలు పెద్ద రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లు ఇప్పటికే వలస జీవుల ప్రయాణాలతో కిటకిటలాడుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితి కొంచెం భిన్నమైనది. అప్పట్లో కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఇచ్చి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పైగా లాక్‌డౌన్ అనుభవం అప్పట్లో తొలిసారి. ఎలాంటి పరిణామాలు, పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే విషయం చాలా మందికి అవగాహన లేని పరిస్థితి. అందుకే వలస జీవులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంచెం భిన్నమైనది. ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో కాస్త అవగాహన ఏర్పడింది. అందుకే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తే ఏం చేయాలి.. అంతకు ముందే ఏం చేసుకోవాలో వలస జీవులు ఆలోచించుకుంటున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా సొంతూళ్ళకు ప్రయణమవుతున్నారు.

ఇప్పుడు మరోసారి స్వస్థలాలకు ప్రయాణం కడుతున్న వలసజీవుల్ని తప్పుబట్టడానికి లేదు. అయితే కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వర్తమానంలో ఇది ప్రమాదకరమైన పరిణామం. వారి నిష్క్రమణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ తొమ్మిది పది నెలలుగా పరిస్థితి కాస్త మెరుగుపడినా ఏ రంగమూ ఇంతవరకూ పూర్వ స్థాయికి చేరలేదు. వ్యాపార, వాణిజ్య కార్య కలాపాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. తాజా పరిణామాల వల్ల అవి మరింత కుదేలవు తాయి. ఇటు ప్రజారోగ్య రంగం సైతం ఇబ్బందుల్లో పడుతుంది. శరవేగంతో మహమ్మారి విస్తరి స్తున్న ప్రస్తుత తరుణంలో జనం సరిగా మాస్కులు ధరించకుండా ఇలా పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడితే దాని దుష్ఫలితాలెలా వుంటాయన్నది తెలియనిది కాదు. ఇప్పుడిదే అందరినీ ఆందో ళనలో పడేస్తున్న విషయం. నిరుటితో పోలిస్తే ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. ఇంతవరకూ దాదాపు పది కోట్లమంది జనం టీకాలు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే టీకాలు అందుబాటులోకొచ్చినవారు నిండా 8 శాతంమంది కూడా లేరు. పైగా వీరిలో అనేకులు రెండో డోస్‌ తీసుకోలేదు. వలస కూలీలకు వారు పనిచేసేచోట పెద్దగా పలుకు బడివుండదు కనుక, వారిలో ఎంతమందికి టీకాలందాయో అంచనా వేయటం కష్టం. దీని సంగతలావుంచి వ్యాక్సిన్‌ తీసుకున్నంతమాత్రాన వైరస్‌ నుంచి రక్షణ కలుగుతుందన్న నమ్మకం లేదని, మాస్కులు ధరించటం తప్పనిసరని వైద్య రంగ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ కిటకిటలాడుతూ కనిపిస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూస్తుంటే వాటిని ఎవరూ పాటిస్తున్న దాఖలాలు లేవు.

ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా అందరిలోనూ భరోసా కలిగించాల్సిన అవసరం వుంది. ఆ భరోసా మాటల్లోకన్నా చేతల్లో కనబడాలి. గత అనుభవాలరీత్యా వలస కూలీలకు కావలసిన రేషన్, ఇతర నిత్యావసరాలు సరఫరా అయ్యేలా చూడాలి. నిరుడు విధించిన లాక్‌డౌన్‌ ముగిశాక కేంద్ర ప్రభుత్వం వలసజీవుల డేటా సేకరణకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా విధానం రూపొందింది. ఈ విషయంలో ఏమేరకు ముందడుగు పడిందో తెలియదుగానీ… అలాంటి ఏర్పాటుంటే వలస కూలీలను గుర్తించి, వారికి సాయపడటం ఇప్పుడు సులభమయ్యేది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి అనువుగా వలస కూలీలకు భరోసా కల్పించడం, ఎక్కడివారక్కడ వుండేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి.

Follow Us