AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Review: తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ విజ‌ృంభణ.. నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సర్కార్లు సీరియస్

యావత్ దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలు ప్రజారోగ్యం కోసం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించాయి. పూర్తి లాక్ డౌన్ విధించే ఆలోచన చేయనప్పటికీ… ప్రజారోగ్యం కోసం కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. తెలంగాణలో రాత్రి...

Covid Review: తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ విజ‌ృంభణ.. నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సర్కార్లు సీరియస్
Covid In Telugu States
Rajesh Sharma
|

Updated on: Apr 25, 2021 | 4:50 PM

Share

Covid Review in Telugu states: యావత్ దేశాన్ని కరోనా వైరస్ (CORONA VIRUS) వణికిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలు (TELUGU STATE) ప్రజారోగ్యం కోసం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించాయి. పూర్తి లాక్ డౌన్ (LOCK DOWN) విధించే ఆలోచన చేయనప్పటికీ… ప్రజారోగ్యం కోసం కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ (TELANGANA)లో రాత్రి పూట కర్ఫ్యూ (NIGHT CURFEW) కొనసాగుతుండగా తాజాగా విద్యాసంస్థలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించేశారు. టెన్త్, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను ప్రస్తుతానికైతే వాయిదా వేశారు. దీనిపై జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలంగాణ విద్యా శాఖ (TELANGANA EDUCATION DEPARTMENT) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (SABITA INDRAREDDY) వెల్లడించారు. కాగా.. ఆదివారం ఏప్రిల్ 27వ తేదీ నుంచి విద్యాసంస్థలకు వేసవి సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం (TELANGANA GOVERNMENT).. ఏప్రిల్ 26వ తేదీని చివరి పనిదినంగా పరిగణిస్తున్నామని వెల్లడించింది. దాంతో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు విద్యాసంస్థలకు అంటే పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు (SUMMER HOLIDAYS)గా ప్రకటించారన్నమాట. ఏప్రిల్ 25 ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి (TELANGANA CHIEF MINISTER) కే.చంద్రశేఖర్ రావు (K CHANDRASHEKHAR RAO) అధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ వేసవి సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే తీసుకున్న నిర్ణయం ప్రకారం పదో తరగతి (10TH CLASS) పరీక్షలను రద్దు చేసి.. 5 లక్షల 21 వేల 392 మందిని పరీక్షలు లేకుండా పాస్ చేసేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి దాకా అందరు విద్యార్థులను ప్రమోట్ చేశారు. విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచేది కోవిడ్ పాండమిక్ పరిస్థితిని జూన్ ఒకటిన సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

అటు ఏపీ ప్రభుత్వం (AP GOVERNMENT) కూడా నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఏపీవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. ఏపీలో నైట్ లైఫ్ కాస్తో కూస్తో వుండేది విజయవాడ (VIJAYAWADA), విశాఖపట్నం (VISHAKHAPATNAM) నగరాలలో మాత్రమే. గుంటూరు (GUNTUR), తిరుపతి (TIRUPATI), కర్నూలు (KURNOOL) నగరాల్లో కాస్త అటు ఇటుగా నైట్ లైఫ్ (NIGHT LIFE) వుంటుంది. దాంతో నైట్ కర్ఫ్యూ ప్రభావం ఈ అయిదు నగరాలలో కనిపిస్తోంది. ఏపీ పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో నైట్ కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విశాఖ జిల్లాలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. పోలీసుల సూచనలతో వైజాగ్ సిటీ ప్రధాన వాణిజ్య సముదాయాలు కర్ఫ్యూ ప్రారంభానికి గంట ముందుగానే మూతపడుతున్నాయి. రాత్రి 9 గంటలకే నగరంలోని చాలా చోట్ల జనసంచారం తగ్గి, రోడ్లు నిర్మానుష్యంగా మారి పోతున్నాయి. నగరంలోని పలుచోట్ల డ్రోన్ కెమెరా (DRONE CAMERA) ద్వారా జనసంచారంపై నిఘా పెట్టారు విశాఖ సిటీ పోలీసులు. విశాఖ నగరంలోనే కాదు జిల్లాలోని అటు రూరల్, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రాత్రి అంతా కర్ఫ్యూ అమలవుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరుకుతోపాటు ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి ప్రాంతాలలో సైతం అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని అడ్డుకున్నారు పోలీసులు. అత్యవసరాల నిమిత్తం తిరిగే వాహనాలకు వెసులుబాటు ఇచ్చిన పోలీసులు, అనవసరంగా బయట తిరిగేవారికి మొదటి రోజు కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సరిపెట్టారు. ఇకపై మాత్రం రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏపీ పోలీసులు.

కరోనా నియంత్రణకు ఓవైపు ప్రయత్నిస్తూనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌పై నజర్ పెట్టాయి. ఏపీలో వ్యాక్సినేషన్ వేగాన్ని పుంజుకుంది. తెలంగాణ మాత్రం కేంద్రం సరైన నెంబర్‌లో వ్యాక్సిన్లు తమకు కేటాయించడం లేదంటూ బ్లేమ్ గేమ్ ఆడుతోంది. అయితేనేం తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని పుంజుకుందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో కేవలం 99 రోజుల్లో ఏకంగా 14 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయగలిగింది. ఇది అగ్రరాజ్యం అమెరికాకు సైతం సాధ్యం కాని రికార్డుగానే పేర్కొనాలి. కాగా.. ఈ రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నెంబర్ కూడా గణనీయంగా వుండడం ముదావహం. దానికి తోడు ఏపీలో 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్కులకు ఉచితంగా టీకా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో సగటున రోజుకు పదివేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే గత రికార్డులు కూడా బద్దలై భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అయ్యే ఛాన్స్ వుంది. ఇప్పటికే పాజిటివిటీ రేటులో గతేడాది (2020)లో నమోదైన రికార్డు బద్దలైంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ రాత్రి పూట కర్ప్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో 18 ఏళ్ళు మొదలుకుని అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 4 కోట్ల డోసులు కావాలంటూ కోవాక్సిన్, కోవీ షీల్డ్ తయారీ సంస్థలైన సీరం,భారత్ బయోటెక్ అధినేతలకు లేఖలు పంపారు. రెండో డోసులకు గాను.. ఏపీలో మొత్తం 7 కోట్ల వ్యాక్సిన్లు కావాలి… దాంతో ముందుగా 4 కోట్ల 8 లక్షల డోసులు పంపాలంటూ లేఖలు రాశారు.

మరోవైపు తెలంగాణలోను వ్యాక్సిన్ పంపిణీకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ జనాభాతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. వివిధ రంగాలలో పని చేస్తున్న వారి సంఖ్య కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి వుంటుందని ప్రభుత్వం అంఛనా వేస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 36 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. మిగిలిన వారిలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా వేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం సుమారు 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. టీకా పంపిణీ కోసం జిల్లాల వారీగా ఇంఛార్జీలను నియమించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మునిసిపల్ మంత్రి కేటీఆర్ కోవిడ్ పాజిటివ్ బాధితులయ్యారు. వీరిద్దరు ఇంట్లో వుంటూనే చికిత్స తీసుకుంటూ.. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని, నియంత్రణా చర్యలను, వ్యాక్సినేషన్ పంపిణీని సమీక్షిస్తున్నారు.

ALSO READ: జూరాల వద్ద కృష్ణా నీటిని తరలించేందుకు కర్ణాటకం.. రాజుకుంటున్న మరో జలవివాదం!