TREIRB Rankers 2024: గురుకుల ఫలితాల్లో ఏకంగా మూడేసి చొప్పున కొలువులు కొట్టిన ఆణిముత్యాలు.. వీరి విజయ గాధలు ఇవే

ఈ కాలంలో ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ.. ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటేనే గగనమైపోతుంటే.. ఒకేసారి ఒకటికి మించి ఉద్యోగాలు సాధించిన పలువురు అభ్యర్ధులు శెభాష్‌ అనిపించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన యువతి సయ్యద్‌ అర్ఫా ఒకేసారి మూడు ప్రభుత్వ కొలువు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సయ్యద్‌ అర్ఫా ఎంస్‌సీ బీఎడ్‌ పూర్తిచేసింది. ఇంటివద్దే ట్యూషన్స్‌ చెపుతూ..

TREIRB Rankers 2024: గురుకుల ఫలితాల్లో ఏకంగా మూడేసి చొప్పున కొలువులు కొట్టిన ఆణిముత్యాలు.. వీరి విజయ గాధలు ఇవే
TREIRB Rankers
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 02, 2024 | 11:24 AM

హైదరాబాద్‌, మార్చి 2: ఈ కాలంలో ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ.. ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటేనే గగనమైపోతుంటే.. ఒకేసారి ఒకటికి మించి ఉద్యోగాలు సాధించిన పలువురు అభ్యర్ధులు శెభాష్‌ అనిపించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన యువతి సయ్యద్‌ అర్ఫా ఒకేసారి మూడు ప్రభుత్వ కొలువు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సయ్యద్‌ అర్ఫా ఎంస్‌సీ బీఎడ్‌ పూర్తిచేసింది. ఇంటివద్దే ట్యూషన్స్‌ చెపుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. భర్త సల్మాన్‌ ప్రభుత్వ టీచర్. సల్మాన్‌ ప్రోత్సాహంతో భార్య అర్ఫాను పోటీపరీక్షలకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో గురుకుల నోటిఫికేషన్లలో భాగంగా నిర్వహించిన 4 వేర్వేరు పరీక్షలకు ఆమె హాజరైంది. వాటిల్లో ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికైంది. మరో ఉద్యోగానికి కూడా 1:2లో మెరిట్‌ సాధించింది. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో గణితం డిగ్రీ లెక్చరర్‌, గణితం జూనియర్‌ లెక్చరర్‌, పీజీటీ గణితం.. మూడింటిలోనూ ఉద్యోగాలు సాధించింది. టీజీటీకి 1:2 నిష్పత్తిలో ఎంపికైంది. ఆ ఉద్యోగం కూడా తనకే ఖాయం అంటోంది అర్ఫా. పట్టుదలతో చదివితే ఏ ఉద్యోగమైన సాధించడం సాధ్యమని, నిరుత్సాహ పడకుండా సన్నద్ధమవమని నిరుద్యోగులకు ఆమె సూచిస్తున్నారు.

గురుకుల బోర్డు ఫలితాల్లో సత్తా.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

తెలంగాణ గురుకుల బోర్డు నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షల్లో ఒకేసారి నాలుగు కొలువులు కొట్టిందీ తెలంగాణ ఆణిముత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీష.. రాజేందర్‌, లలిత దంపతుల రెండో కూతురై. మనీష చిన్న తనం నుంచే చదువులో ప్రతిభకనబరిచేది. గత ఏడాది (2023) గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్‌ పలు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మనీష కష్టపడి చదివి, పరీక్షలు రాసింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ కొలువులు సాధించింది. దీంతో ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ.. మూడు ప్రభుత్వ కొలువులు సాధించిన ప్రవీణ్‌

చిన్నతనంలో మమ్మల్ని చదివించేందుకు అమ్మానాన్నలు పడిన కష్టాలు చూసి.. పెద్దయ్యాక ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబ కష్టాలు గట్టెక్కించాలని అనుకున్నాడు మంచిర్యాల జిల్లా పొనకల్‌కు చెందిన ప్రవీణ్‌. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం, బీఈడీ పూర్తిచేసిన ప్రవీణ్‌ అరశాతం మార్కుతో ఒక సారి సర్కార్‌ కొలువుకు దూరమయ్యాడు. నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నం ప్రారంభించాడు. ఐదేళ్ల క్రితమే చదువు పూర్తయిన క్యాంపస్‌లోనే ఉండి పోటీపరీక్షలకు సిద్ధమయ్యాడు. డబ్బులేక కొద్దిరోజులు పస్తులున్నా ఓ స్నేహితుడి సాయంతో క్యాంపస్‌లోని ఈఎంఆర్‌సీలో నైట్‌వాచ్‌మెన్‌ ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.ఆరు వేల జీతంతో సర్దుకుపోతూ.. తనకు కేటాయించిన ఓ గదిలో ఉంటూ పోటీపరీక్షలకు సిద్ధమయ్యాడు. గతేడాది సంక్షేమ గురుకుల బోర్డులో ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలవగా.. ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాత్రీపగలూ తేడాలేకుండా కష్టపడి చదివాడు. ఆగస్ట్‌లో పరీక్షలు రాశాడు. తాజాగా వెల్లడైన పలితాల్లో జూనియర్‌ కళాశాలలో ఒకేసారి టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఎల్బీస్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పీజీటీ ఉద్యోగ నియామకపత్రాన్ని అందుకున్నాడు. మూడు ఉద్యోగాలు వచ్చిన సంతోషాన్ని ప్రవీణ్‌ తాజాగా మీడియాతో పంచుకుని, ఆనందం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

నల్లగొండ జిల్లాకు చెందిన తీగల సుదర్శన్ రెడ్డి.. మూడు కొలువులతో హ్యాట్రిక్‌

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బెండల్ పహాడ్ గ్రామానికి చెందిన తీగల సుదర్శన్ రెడ్డి తల్లిదండ్రులు వృత్తిరిత్యా వ్యవసాయ కూలీలు. నల్లగొండ జిల్లా జర్నలిస్టుగా సాక్షిలో ప్రస్థానం ప్రారంభించిన సుదర్శన్‌ రెడ్డి.. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఏకంగా మూడు గురుకుల ఉద్యోగాల్లో అర్హత సాధించాడు. గురుకుల ఉపాధ్యాయ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాదించాడు. ఆ తర్వాత వెలువడిన టీజీటీ ఫలితాల్లో పదుల సంఖ్యలో ర్యాంక్ సాధించాడు. తాజాగా గురుకుల పీజీటీలో 5వ ర్యాంక్ సాధించాడు. ఉన్న ఉద్యోగాన్ని వదులు కోని ప్రభుత్వ ఉద్యోగం వైపు అడుగులు వేసి తొలి ప్రయత్నంలోనే మూడు ఉద్యోగాలు సాధించాడు సుదర్శన్ రెడ్డి. కొడుకు సాధించిన విజయం చూసి తండ్రి మోహన్ రెడ్డి మురిసిపోతూ.. సుదర్శన్ పట్టుదలతో చదవి, తమ కల సాకారం చేశాడని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.