సర్కార్ బడి పిల్లలకు గుడ్న్యూస్.. ఇకపై 1 నుంచి 5 తరగతుల పిల్లలందరికీ బలే ఛాన్స్!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ బడుల్లో చదివే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకూ 2025-26 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలు కూడా అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులందరికీ ఉచితంగా ప్రతీయేట..

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ బడుల్లో చదివే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకూ 2025-26 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలు కూడా అందించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ 6 నుంచి 10 తరగతులు చదివు విద్యార్థులరే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం టెక్ట్స్ బుక్స్తోపాటు నోట్ బుక్స్ కూడా అందిస్తోంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి వీరితోపాటు ప్రాథమిక పాఠశాలల్లో చదివే 1 నుంచి ఐదు తరగతుల విద్యార్ధులకు కూడా నోట్ బుక్స్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.60 లక్షల మంది నిరుపేద విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వ బడుల్లో చదివే ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు 3 నోట్ బుక్స్, 3 నుంచి 5 తరగతులు చదివే విద్యార్ధులకు నాలుగు నోట్బుక్స్ చొప్పున పంపిణీ చేయనున్నారు. పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లతోపాటు ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు అదనంగా నోట్ బుక్స్ కూడా అందించనున్నారు. మే 15 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పుస్తకాలను సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఇటీవల విద్యా శాఖ తీసుకున్న మరికొన్న ముఖ్య నిర్ణయాలు ఇవే..
ఇకపై ప్రతి ఏడాది మే 9న పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. జూన్ 6 నుంచి బడిబాటతోపాటు అదే రోజు మెగా పీటీఎం పేరిట తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఖాన్ అకాడమీ ద్వారా మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 6 నుంచి 12వ తరగతి వరకు గణితం, సైన్స్ సబ్జెక్టులను ఆన్లైన్ పాఠాలు నేర్చుకునే సదుపాయం ఉంది. దాన్ని మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అకాడమీకి చెందిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నీట్, జేఈఈ కోచింగ్ కూడా ఉచితంగా విద్యార్ధులు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకావసరాల పిల్లల కోసం నడుస్తున్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని విద్యాశాఖ పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.