NEET 2025 Counselling: నీట్ కౌన్సెలింగ్లో లోకల్ కోటా ఎలా నిర్ణయిస్తారో తెలుసా? ఏపీ, తెలంగాణకు ఒకటే రూల్..
తెలుగు రాష్ట్రాల్లో MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ 2025 ర్యాంకు ఎంత ముఖ్యమో.. స్థానిక కోటా కూడా అంతే ముఖ్యం. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్ లైన్ లో ఉంటుంది కాబటి.. చిన్న పొరబాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్థానిక కోటా కిందకు ఎవరు వస్తారు.. నిబంధనలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్, జులై 21: తెలుగు రాష్ట్రాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఆన్లైన్ ద్వారా నడిచే ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ.. ఆటోమేటిక్గా ర్యాంకులు, వెబ్ ఆప్షన్ల నమోదు ఆధారంగా జరిగిపోతుంది. ఆన్లైన్లో వివరాల నమోదులో చిన్న పొరపాటు జరిగినా సీటు చేజారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లోకల్ కోటా కింద సీట్లు పొందే విద్యార్ధులు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ తప్పనిసరిగా స్థానికంగా చదివి ఉండాలని, వీరు మాత్రమే ఎంబీబీఎస్ లోకల్ కోటా సీట్లకు అర్హులని నిపుణులు స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 25,400 సీట్లను ఆలిండియా కోటా కింద మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ భర్తీ చేస్తుంది. మిగిలిన సీట్లలో ఏపీలో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గత ఏడాది 6500 సీట్లను భర్తీ చేశారు. ఈ ఏడాది మరికొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడంతో సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఏపీలో ఉన్న ప్రభుత్వ సీట్లలో 15 శాతం అంటే.. దాదాపు 490 సీట్లు ఆలిండియా కోటా కింద భర్తీ అవుతాయి. ఇక బీడీఎస్ సీట్లు 140 ఉండగా.. వాటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లకు ఏపీలో స్థానిక కోటా కింద ప్రవేశాలు కల్పిస్తారు.
అటు తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మొత్తం 8415 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. వీటిల్లో 15 శాతం అంటే 637 సీట్లు ఆలిండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగతా 85 శాతం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లు కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా 50 శాతం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. బీడీఎస్ సీట్లు తెలంగాణలో 100 ఉన్నాయి. వీటిల్లోనూ 15 శాతం ఆలిండియా కోటా కింద భర్తీ అవుతాయి.
లోకల్ కోటా ఎలా నిర్ణయిస్తారంటే?
ఏపీలో తొమ్మిది నుంచి ఇంటర్ వరకు చదివితే వారినే లోకల్గా పరిగణిస్తాం. నాలుగేళ్లలో ఒక్క ఏడాది బయట రాష్ట్రాల్లో చదివినా నాన్లోకల్ కోటా కిందకు వస్తారు. తెలంగాణలోనూ ఇదే రూల్ పాటిస్తున్నారు. నీట్ పరీక్షకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే వారిని స్థానికులుగా పరిగణిస్తామని, వీరికి మాత్రమే లోకల్ సీట్లను కేటాయిస్తామన్నారు. దూరవిద్య ద్వారా చదివిన వారు గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉన్నట్టుగా రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మేనేజ్మెంట్, కన్వీనర్ కోటా సీట్లన్నీ నీట్ 2025లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మాత్రమే మెరిట్ ద్వారా భర్తీ చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




