AP Inter Toppers 2025: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు.. అన్ని గ్రూపుల్లో టాపర్లు వీరే!
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అత్యధికంగా ఉత్తీర్ణత నమోదైంది. గత పదేళ్లతో పోల్చి చూస్తే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఈసారే అత్యధికంగా 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అన్ని గ్రూపుల్లో అమ్మాయిలే టాపర్లుగా నిలిచారు..

అమరావతి, ఏప్రిల్ 13: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. గత పదేళ్లతో పోల్చి చూస్తే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఈసారే అత్యధికంగా 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈ సారి 11 శాతం పెరిగింది. ఇక ఫస్ట్ ఇయర్లో చూస్తే.. 2016లో గరిష్ఠంగా 54 శాతం, 2015లో 47 శాతం, ఈ ఏడాదికి కూడా 47 శాతం మేర ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో ఏడాదిలో 83 శాతం ఈసారి ఉత్తీర్ణత నమోదైంది.
మొత్తం 10,17,102 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తే వారిలో పస్ట్ ఇయర్లో 4,87,295 మంది పరీక్ష రాస్తే.. 3,42,979 మంది ఉత్తీర్ణత పొందారు. ఇక సెకండియర్లో 4,22,030 మంది పరీజోరాస్తే వారిలో 3,51,521 (80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు 75 శాతం, అబ్బాయిలు 66 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్లో అమ్మాయిలు 86 శాతం, అబ్బాయిలు 80 శాతం చొప్పున ఉత్తీర్ణత పొందారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఫస్ట్ ఇయర్లో 50,314 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 23,799 మంది పాస్ అయ్యారు. సెకండియర్లో 39,783 మందికిగానూ 27,276 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతమే మెరుగ్గా ఉండటం విశేషం. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా 70%, 81% చొప్పున ఉత్తీర్ణత నమోదై రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అయితే హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థల్లో ఇంటర్ ఫస్టియర్లో కేవలం 34 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్కు సంబంధించి 60 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
ఇంటర్మీడియట్ సెకండియర్లో ఎంపీసీ గ్రూపులో 11 మంది విద్యార్థులకు అత్యధికంగా 992 మార్కులు వచ్చాయి. వీరిలో 8 మంది బాలికలే కావడం విశేషం. మిగతా ముగ్గురు బాలురు ఉన్నారు. బైపీసీ గ్రూపులో ఓ బాలికకు 993 మార్కులు రాగా, బాలురలో గరిష్ఠంగా 990 చొప్పున ఇద్దరికి వచ్చాయి. ఎంఈసీలో ఇద్దరు బాలికలకు 982, ఇద్దరు బాలురకు 981 చొప్పున మార్కులు వచ్చాయి. సీఈసీలో 979, హెచ్ఈసీలో అత్యధికంగా 980 మార్కులు అమ్మాయిలకే వచ్చాయి. ఇక ఫస్టియర్లో ఎంపీసీలో 8 మంది అమ్మాయిలకు 468, ముగ్గురు అబ్బాయిలకు 467 మార్కులు, ఎంఈసీలో ఓ బాలికకు 494, ఇద్దరు బాలురుకు 493 చొప్పున మార్కులొచ్చాయి. బైపీసీలో ఓ బాలికకు 437, ఇద్దరు బాలురుకు 436 చొప్పున మార్కులు వచ్చాయి. సీఈసీలో ఓ బాలిక, బాలుడుకు 490 చొప్పున, హెచ్ఈసీలో బాలిక, బాలుడు 489 చొప్పున మార్కులు వచ్చాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.