Inter Result Date 2025: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్! ఫలితాలు ఎప్పుడంటే..
ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా వెను వెంటనే ఇంటర్ బోర్డు ప్రారంభించింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించగా మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేశారు. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా దాదాపు చివరి దశకు..

అమరావతి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు ముగియటంతో విద్యార్థులంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. వీరంతా ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా వెను వెంటనే ఇంటర్ బోర్డు ప్రారంభించింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించగా మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేశారు. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. అంతా అనుకున్నట్లు పూర్తైతే ఫలితాలు మరో వారంలోనే ప్రకటించనున్నారు.
జవాబు మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావటంతో ప్రస్తుతం అధికారులు కంప్యూటరీకరణ ప్రక్రియను చేస్తున్నారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతికపరమైన అంశాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రకటించనున్నారు. అలాగే ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకురానుంది. కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తైనాక ప్రభుత్వ అనుమతి రాగానే ఫలితాలు ప్రకటిస్తారు. అన్ని కుదిరితే ఏప్రిల్ 15వ తేదీలోపు ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి 12వ తేదీన రెండో శనివారం కాగా 13న ఆదివారం వచ్చింది. ఇక ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతి కావటంతో సెలవు వచ్చింది. దీంతో ఏప్రిల్ 15వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈసారి పదో తరగతి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్లతోపాటు ఫలితాలను కూడా వాట్సాప్ సేవల ద్వారానే పొందే ఛాన్స్ అందిస్తున్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు ‘9552300009’ మన మిత్ర నెంబర్కు Hi అని మెసేజ్ పెట్టి నేరుగా ఫలితాలను పొందొచ్చు. మార్కుల జాబితా పీడీఎఫ్ రూపంలో డిస్ ప్లే అవుతుంది. ఈ మాదిరిగా వచ్చే మార్కుల జాబితాలు…. షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. అలాగే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.