AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు. మండ్య జిల్లా కె.ఆర్.పేటలో శనివారం జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు.

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం!
Siddaramaiah Quits Electoral Politics
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 26, 2026 | 6:15 PM

Share

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు.ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. నేటి రాజకీయాల్లో వస్తున్న మార్పులు, వయసురీత్యా వస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ పోటీ చేయబోనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వరుణా నియోజకవర్గ ప్రజలు తనపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గతంలో ఎన్నికలంటే నియోజకవర్గ ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి గెలిపించేవారని, కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయాలు పూర్తిగా అవినీతిమయమయ్యాయని, ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కీలక పాత్ర పోషించే దుస్థితి వచ్చిందని విమర్శించారు. నిజాయితీ రాజకీయాలకు ప్రస్తుత వ్యవస్థలో ఆసరా లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తనకు ప్రస్తుతం 79 ఏళ్లు అని, ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసేనాటికి తన వయసు 81-82 సంవత్సరాలకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వయసురీత్యా ఆరోగ్యం మునుపటిలా బలంగా లేకపోవడంతో, గతంలో ఉన్న ఉత్సాహంతో ఇకపై కష్టపడి పనిచేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు సిద్ధరామయ్య గుర్తుచేసుకున్నారు. 2028 నాటికి తన రాజకీయ జీవితంలోకి వచ్చి సరిగ్గా ఐదు దశాబ్దాలు (50 ఏళ్లు) పూర్తవుతాయని తెలిపారు.

తన రాజకీయ జీవితంలో ఎన్నో ఓటములు, విజయాలను చూశానని, అయితే తాను నమ్మిన సిద్ధాంతాలకు, మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, రాజకీయాల్లో ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంటానని, ప్రజల కష్టసుఖాలకు నిత్యం గొంతుకగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు తనను ఆదరించి నడిపించారని, ఆ రుణం తీర్చుకోలేనిదంటూ తన భవిష్యత్ జీవితాన్ని కూడా పూర్తిగా ప్రజా సేవకే అంకితం చేస్తానని సిద్ధరామయ్య ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us