Gold Rates: బంగారం ధరలపై బిగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ఇక నుంచి..
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి సెబీ కొత్త మాార్పులు చేయనుంది. వీటి గురించి ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అవసరముంది. కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఎలాంటి మార్పులు రానున్నాయో ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెడుతున్నారా..? గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారా..? అయితే మీకో అలర్ట్.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) కొత్త నిబంధనలను అమలు చేయనుంది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్లో ఉండే గోల్డ్, సిల్వర్ ధరలను లెక్కగట్టే విధానంలో సెబీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పెట్టుబడిదారులకు పారదర్శకత, స్పష్టత అందించేందుకు సెబీ ఈ మార్పులు చేసింది. కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. వీటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ధరలను నిర్ణయించే విధానంలో మార్పులు
ఇక నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్ ధరలను నిర్ణయించే విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ధరల ప్రకారం వీటి విలువను లెక్కగట్టేవారు. కానీ ఇక నుంచి ఈ నిబంధనల్లో సెబీ మార్పులు చేసింది. ఇక నుంచి భారత బులియన్ మార్కెట్ స్పాట్ ధరల ప్రకారం ధరలను నిర్ణయించనున్నారు. భారత గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సేంజ్లు, ఎంసీఎక్స్లోని ధరలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా లెక్కిస్తారు. ఇప్పటివరకు లండన్ మార్కెట్ ఆధారంగా తీసుకోవడం వల్ల దేశీయ మార్కెట్ ధరలతో పోలిస్తే తేడాలు ఉంటున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లకు తగ్గట్లుగా ధరలు ఉండేందుకు సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
పెట్టుబడిదారులకు పారదర్శకతను అందించడం, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దేశీయ మార్కెట్ ధోరణులు ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూడటంలో భాగంగా సెబీ ఈ రూల్స్ తీసుకొచ్చింది. ఈ నిర్ణయం 2025లో భారీగా నిధుల ప్రవాహాన్ని అందుకున్న బంగారం, వెండి ETFలతో పాటు కమోడిటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో ధర నిర్ణయాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజరీ కమిటీలో చర్చించిన అనంతరం లండన్ మార్కెట్ నుంచి దేశీయ మార్కెట్కు మార్చాలని సెబీ నిర్ణయించింది. దేశీయ స్పాట్ ధరను నిర్ణయించడానికి మారకపు రేట్లు, కస్టమ్స్ సుంకం, రవాణా ఖర్చులు, పన్నులు, ఇతర స్థానిక సర్దుబాట్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కొత్త వ్యవస్థ ఈ అనవసరమైన సంక్లిష్ట ప్రక్రియను తొలగిస్తుందని, వాల్యుయేషన్ను మరింత పారదర్శకంగా సరళంగా చేస్తుందని సెబీ భావిస్తోంది. ఈ నిర్ణయం డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టేవారికి సానుకూలంగా ఉండనుంది.
