AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: దేశ ప్రజలకు మరో షాకింగ్.. మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! ఎంతంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి. ఈ కారణంతో చమురు కంపెనీలపై భారం పెరుగుతుంది. చమురు కంపెనీలు నష్టాల నుంచి బయట పడాలంటే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదు.

Petrol Prices: దేశ ప్రజలకు మరో షాకింగ్.. మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! ఎంతంటే..?
Petrol Prices
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 4:15 PM

Share

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్యులకు షాక్ తగులుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. భారత్‌పై కూడా దాని ప్రభావం పడింది. దేశంలో ఇంధన ధరల పెరుగుదుల కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో భారత్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.3 చొప్పున పెంచగా.. మంగళవారం మరోసారి పెంచారు.

మరోసారి పెంపు..?

మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇంధన ధరలను మరోసారి పెంచడంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. హార్ముజ్ జలసంధి దిగ్గంధనానికి గురి కావడం, ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గకపోతే చమురు కంపెనీలు మరింత నష్టపోవచ్చు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. చమురు కంపెనీలు లాభాల్లోకి రావాలంటే భవిష్యత్తులో ధరలను మరింత పెంచే అవకాశముందని చెబుతున్నారు. కంపెనీలు లాభాల బాట పట్టాలంటే 16 శాతం వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి ఉంటుందని అంటున్నారు.

16 శాతం పెంపు..?

మడి చమురు ధర ప్రస్తుతం 100 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. 120 డాలర్లకు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.25 నుంచి రూ.28 వరకు పెంచాల్సి వస్తుందని చెబుతున్నారు. ధరలను స్ధిరంగా ఉంచడానికి ప్రభుత్వం, చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఒక్క త్రైమాసికంలో ఈ నష్టం రూ.లక్ష కోట్లకుపైగా పెరిగింది. ఇటీవల లీటర్‌పై రూ.3 పెంచకముందు.. లీటర్ పెట్రోల్‌పై రూ.26, డీజిల్‌పై రూ.81.90 నష్టం ఉండేది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో చమురు కంపెనీలు, ప్రభుత్వ ఆదాయంపై రూ.లక్ష కోట్ల మేర ప్రభావం పడవచ్చని తెలుస్తోంది. రూపాయి విలువ పడిపోవడంతో చమురు దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారాయి. గతంలో 1 డాలర్ ధర రూ.87గా ఉండగా.. ఇప్పుడు రూ.95కి పెరిగింది. దీని వల్ల విదేశాల నుంచి చమురు కొనుగోలు ఖర్చు మరింత పెరిగింది.

Follow Us