దేవాలయాల బంగారంపై కన్నేసిన ప్రభుత్వం? వదంతులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ!
బంగారం కొనకండి అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ సభ వేదికగా యావత్ దేశానికి పిలుపునిచ్చారు. ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయకూడదని సూచించారు. దిగుమతి వస్తువుల వాడకం తగ్గించినా, ఆపేసినా, అది దేశభక్తి అవుతుందంటూ మోదీ చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో.. కొన్ని వర్గాల్లో భారత ప్రభుత్వం దేవాలయాల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చుకోబోతోందని, అలాగే ప్రజల బంగారం ప్రభుత్వం లెక్కలు వేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

బంగారం కొనకండి అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ సభ వేదికగా యావత్ దేశానికి పిలుపునిచ్చారు. ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయకూడదని సూచించారు. దిగుమతి వస్తువుల వాడకం తగ్గించినా, ఆపేసినా, అది దేశభక్తి అవుతుందంటూ మోదీ చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో.. కొన్ని వర్గాల్లో భారత ప్రభుత్వం దేవాలయాల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చుకోబోతోందని, అలాగే ప్రజల బంగారం ప్రభుత్వం లెక్కలు వేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలు ప్రజల్లో తీవ్ర గందరగోళానికి దారితీయడంతో, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ఈ ఊహాగానాలను పూర్తిగా కొట్టివేసింది.
ప్రభుత్వం దేవాలయ ట్రస్టుల వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంటుందనే వాదనలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆలయ గోపురాలు, ద్వారాలు లేదా ఇతర కట్టడాలపై ఉన్న బంగారం దేశ వ్యూహాత్మక నిల్వలకు సంకేతమని వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదని పేర్కొంది. ఇటువంటి తప్పుడు సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా అనవసర భయాందోళనలకు గురిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారతీయ ఇళ్లలో, దేవాలయాలలో ఉన్న బంగారం విలువ చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం.. భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారం ఉంది. అలాగే, అధికారిక లెక్కలు లేనప్పటికీ, నిపుణుల అంచనా ప్రకారం దేశంలోని వివిధ దేవాలయాల్లో 3,000 నుండి 4,000 టన్నుల బంగారం ఉండవచ్చు. ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వల కంటే కూడా ఎక్కువ.
విధాన నిర్ణయాలు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా అధికారిక వెబ్సైట్లు, పత్రికా ప్రకటనలు, ధృవీకరించిన వేదికల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. అనధికారిక మూలాల నుండి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దు, వ్యాప్తి చేయవద్దు అని దేశ పౌరులను కోరింది.
మరోవైపు, ప్రభుత్వం బంగారం కొనుగోళ్లపై ఎటువంటి నిషేధం విధించలేదు. మతపరమైన సంస్థల ఆస్తులపై ఎటువంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోలేదు. ధృవీకరించని వార్తలను షేర్ చేసే ముందు వాటి వాస్తవికతను పరిశీలించడం బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరి కర్తవ్యం..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
