AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌ డేటా సెంటర్‌పై ఇరాన్‌ దాడి..! ఎంత నష్టం జరిగిందంటే..?

మధ్యప్రాచ్యంలో ఇరాన్ AWS డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరపడం ఆధునిక యుద్ధంలో కొత్త మలుపు. వాణిజ్య డేటా సెంటర్‌లు నేరుగా లక్ష్యంగా మారడం ఇదే మొదటిసారి. AI, క్లౌడ్ సేవల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు కీలక సాంకేతిక మౌలిక సదుపాయాలు యుద్ధ వ్యూహాల్లో భాగమవుతున్నాయని సూచిస్తున్నాయి.

అమెజాన్‌ డేటా సెంటర్‌పై ఇరాన్‌ దాడి..! ఎంత నష్టం జరిగిందంటే..?
Aws
SN Pasha
|

Updated on: Apr 01, 2026 | 8:55 PM

Share

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని AWS (అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌) కు చెందిన రెండు డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిపినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో బహ్రెయిన్‌లోని మరో వాణిజ్య డేటా సెంటర్ కూడా ప్రభావితమైంది. యుద్ధ సమయంలో వాణిజ్య డేటా సెంటర్లను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ దాడులు సాంకేతిక మౌలిక సదుపాయాలు కూడా యుద్ధ వ్యూహాల్లో భాగమవుతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి. గతంలో డేటా సెంటర్లు ప్రధానంగా సైబర్ దాడులు లేదా గూఢచర్యానికి మాత్రమే గురయ్యేవి. అయితే ఇప్పుడు డ్రోన్ దాడుల ద్వారా భౌతికంగా ధ్వంసం చేయడం ఒక కొత్త మలుపు తీసుకువచ్చింది. 2024లో రష్యా అనుబంధ డేటా సెంటర్‌పై ఉక్రెయిన్ హ్యాకర్లు సైబర్ దాడి చేసిన ఘటనతో పోలిస్తే, ఈ దాడి పూర్తిగా భిన్నంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్ల ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యూఎస్‌ సైన్యం తమ కార్యకలాపాల్లో AI ఆధారిత నిర్ణయాలను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ సదుపాయాలు వ్యూహాత్మకంగా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో శత్రు దేశాల సాంకేతిక సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డేటా సెంటర్లు క్లౌడ్ సేవల హృదయంగా పనిచేస్తాయి. వినోద రంగం నుంచి బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల వరకు అనేక వ్యవస్థలు వీటిపై ఆధారపడి ఉంటాయి. AWS వంటి సెంటర్లు దెబ్బతింటే, సేవల సరఫరాలో అంతరాయం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఏఈలో జరిగిన ఈ దాడి ఇప్పటికే బ్యాంకింగ్ సేవలపై కొంత ప్రభావం చూపినట్లు సమాచారం.

ఇరాన్ సైన్యం ప్రకటనల ప్రకారం శత్రు సైనిక, గూఢచార కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతోంది. అయితే, ఈ డేటా సెంటర్లను అమెరికా నేరుగా ఉపయోగించిందా అనే విషయం స్పష్టత లేకపోవడం గమనించాల్సిన అంశం. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, యూఏఈ-అమెరికా సాంకేతిక భాగస్వామ్యంపై సందేశం ఇవ్వడమే ఈ దాడి లక్ష్యంగా ఉండవచ్చు. భవిష్యత్తులో AI, క్లౌడ్ వినియోగం మరింత పెరిగే కొద్దీ, డేటా సెంటర్లు యుద్ధాల్లో కీలక లక్ష్యాలుగా మారే అవకాశముంది. ఈ పరిణామం ప్రపంచ భద్రతా విధానాల్లో కొత్త సవాళ్లను తెస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us