Indian Railways: రన్నింగ్ ట్రైన్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు.. జస్ట్ రూ.100తో ఇలా వైద్యం పొందండి!
భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 2.5 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణం చిన్నదైనా, పెద్దదైనా, ప్రజలు రైలు ప్రయాణాన్ని సౌకర్యవంతమైనదిగా, సురక్షితమైనదిగా, చవకైనదిగా భావిస్తారు. ఇంత మంది ప్రయాణిస్తున్నప్పుడు, ఎవరి ఆరోగ్యమైనా అకస్మాత్తుగా క్షీణించవచ్చు. ఎవరైనా తల తిరగడం, వాంతులు, జ్వరం లేదా ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ, సజావుగా నడుస్తున్న రైలులో మీరు డాక్టర్ను ఎలా పిలవగలరు? ఇది చాలా మందికి ఉండే సందేహం. అటువంటి పరిస్థితిలో రైలులో మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తే డాక్టర్ను ఎలా పిలవాలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోని ఉండాలి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, రైల్వేలో ప్రయాణికుల కోసం ప్రత్యేక అత్యవసర వైద్య వ్యవస్థ అందుబాటులో ఉంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం..

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఎవరికైనా గుండెపోటు రావడం, వాంతులు, జ్వరం లేదా ఇతర అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తితే ఏం చేయాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమయంలో ప్రాణాలను కాపాడటానికి రైల్వే కొన్ని ప్రత్యేక సేవలను అందిస్తోంది. రైలు ప్రయాణంలో ఎవరికైనా ఆరోగ్యం క్షీణించినప్పుడు లేదా అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులో ఉంచింది. ఈ నంబర్కు కాల్ చేసి మీ సీటు నంబర్, కోచ్ వివరాలు, అనారోగ్యం గురించి చెబితే, తదుపరి వచ్చే పెద్ద రైల్వే స్టేషన్లో డాక్టర్ ప్లాట్ఫారమ్ మీద సిద్ధంగా ఉంటారు.
వైద్య సహాయం పొందే పద్ధతులు:
హెల్ప్లైన్ నంబర్ 139:
భారతీయ రైల్వే ఏకీకృత హెల్ప్లైన్ నంబర్ 139 కి కాల్ చేయండి. ఐవిఆర్ (IVRS) సూచనలను అనుసరించి మెడికల్ ఎమర్జెన్సీ ఆప్షన్ను ఎంచుకోవాలి. మీరు మీ PNR నంబర్ లేదా కోచ్, సీటు వివరాలను అందిస్తే, కంట్రోల్ రూమ్ వెంటనే స్పందించి తదుపరి స్టేషన్లో వైద్యుడిని ఏర్పాటు చేస్తుంది.
TTE లేదా రైలు సిబ్బందిని సంప్రదించడం:
మీకు ఫోన్ చేసే పరిస్థితి లేకపోతే, వెంటనే మీ కోచ్లోని TTE ని లేదా అటెండెంట్ను సంప్రదించండి. వారి వద్ద ఉండే వైర్లెస్ సెట్ ద్వారా తదుపరి స్టేషన్ మాస్టర్కు సమాచారం అందిస్తారు. రైలులో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అందుబాటులో ఉంటుంది.
సోషల్ మీడియా (X/Twitter):
ప్రస్తుతం రైల్వే శాఖ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. మీ సమస్యను వివరించి @RailMinIndia లేదా @RailwaySeva ను ట్యాగ్ చేస్తూ మీ PNR నంబర్తో ట్వీట్ చేస్తే, నిమిషాల వ్యవధిలోనే సహాయం అందుతుంది.
రుసుము, సౌకర్యాలు:
రైల్వే డాక్టర్ సేవలకు కేవలం రూ.100 మాత్రమే ఛార్జ్ చేస్తారు. దీనికి రశీదు కూడా ఇస్తారు. ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఒక మోతాదు మందులు ఉచితంగా ఇస్తారు.. అదనపు మందులు లేదా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే దానికి అయ్యే ఖర్చులు ప్రయాణికులే భరించాలి. ప్రతి రైలులో డాక్టర్లు ప్రయాణిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి TTE వద్ద ఉండే చార్ట్ చూడవచ్చు. డాక్టర్లు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆప్షన్ ఇస్తార. కాబట్టి వారి సీటు వివరాలు రైల్వే వద్ద ఉంటాయి. రైలు ప్రయాణంలో ప్రాణాపాయం సంభవించినప్పుడు కంగారు పడకుండా ఈ మార్గాలను అనుసరించండి. మీ చుట్టుపక్కల ప్రయాణికులకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




