Budget 2023-24: ఈసారి బడ్జెట్లో చిన్న పొదుపు పథకాలకు పెద్ద ప్రోత్సాహం! ఎస్బీఐ అంచనాలు ఇవే..
వచ్చే కేంద్ర బడ్జెట్ అంచనాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ నివేదికను ప్రకటించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న పొదుపు పథకాలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రోత్సాహాన్ని ఆశించవచ్చని అంచనావేసింది.

కేంద్రం బడ్జెట్ కోసం అన్ని రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చాలా మంది వ్యాపారవేత్తలతో పాటు పెట్టుబడి దారులు, ఫైనాన్షియల్ నిపుణులు నిర్మలమ్మ పద్దులపై ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ముఖ్యంగా వడ్డీ రేట్లపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అందులోనూ ప్రధానంగా స్వల్ప పెట్టుబడి పథకాలు ప్రారంభించాలనుకునేవారు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్ అంచనాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ నివేదికను ప్రకటించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న పొదుపు పథకాలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రోత్సాహాన్ని ఆశించవచ్చని అంచనావేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎస్బీఐ నివేదిక ప్రకారం..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలకు కేంద్రం ప్రోత్సాహాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాలను మరింత మంది వినియోగించుకునేలా తీర్చిదిద్దనుంది. వడ్డీ రేట్ల పెంపుతో పాటు పలు ప్రోత్సాహాలను అందించనుంది. సుకన్య పథకానికి సంబంధించిందే ఉదాహరణ తీసుకుంటే 12 ఏళ్లుగా వదిలేసిన అకౌంట్లను సింగిల్ సెటిల్మెంట్ లో క్లియర్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇటీవల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాల వడ్డీ రేట్లను కూడా 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచిన నేపథ్యంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), కిసాన్ వికాష్ పత్ర (KVP) వంటి ఇతర చిన్న పొదుపు పథకాలకు కూడా వడ్డీ రేటు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి మాత్రం వడ్డీ రేటు పెంచలేదు. అది 7.6 శాతం వద్ద ఉంది. చివరిసారిగా 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథక వడ్డీని కేంద్ర ప్రభుత్వం సవరించింది.
ఇవి కూడా..
ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధికి అడ్డంకులను కూడా నివేదిక హైలైట్ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కు ద్రవ్యోల్బణ పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. 3.5 శాతం డిఫ్లేటర్తో జీడీపీని 10 శాతం కంటే తక్కువే నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ తన నివేదికలో అంచనావేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..







