Silver Price: 2026లో వెండి ధర పెరుగుతుందా.. ఇన్వెస్ట్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..
బంగారం కంటే వెండి ధరలు ఇప్పుడు జోరుగా పెరుగుతున్నాయి. డాలర్ బలహీనత, పారిశ్రామిక డిమాండ్ కారణంగా వెండి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర త్వరలోనే రూ.58 నుండి రూ.65 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఏకంగా రికార్డు స్థాయిని చేరాయి. అయినప్పటికీ వెండి ధరలు బంగారం, స్టాక్స్, బాండ్లు వంటి వాటికంటే మెరుగైన పనితీరు కనబరుస్తుండటంతో ప్రజలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. మార్కెట్ నిపుణుల ప్రకారం.. వెండి ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన వనరుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
వెండి ధరలు పెరగడానికి కారణాలివే
వెండి ధరలు భారీగా పెరగడం వెనుక అనేక ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలు ఉన్నాయని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచ అంశాలు: ప్రపంచవ్యాప్తంగా తక్కువ వడ్డీ రేట్లు, US డాలర్ విలువలో కొనసాగుతున్న బలహీనత, పెట్టుబడిదారుల పెట్టుబడి దిశలో మార్పులు వెండిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
సురక్షిత పెట్టుబడి: ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం, డాలర్ విలువ క్రమంగా తగ్గుతుండటం వంటి సంకేతాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగా చూస్తున్నారు.
పారిశ్రామిక డిమాండ్: ఇండియన్ సిల్వర్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ ప్రకారం.. వెండికి దీర్ఘకాలికంగా పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉంది. సౌర ఫలకాలు, బ్యాటరీలు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ వంటి రంగాలు వెండిని ఎక్కువగా ఉపయోగించడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
ప్రస్తుత ప్రపంచ మార్కెట్ వాతావరణం అనిశ్చితితో నిండి ఉందని, దీని వల్ల వెండి ఆధారిత పెట్టుబడి ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని నిపుణులు అంటున్నారు.
రాబోయే రోజుల్లో వెండి ధర ఎంత ఉంటుంది..?
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ను పరిశీలిస్తే.. వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టమైన అంచనాలు ఇచ్చారు. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర త్వరలో 58డాలర్ల నుంచి 65డాలర్లకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మనదేశంలోనూ వెండి ధరలు పెరుగుతాయి. పారిశ్రామిక వినియోగం, సురక్షిత పెట్టుబడి సెంటిమెంట్, సరఫరా పరిమితుల కలయిక వెండి ధరను పెంచే అవకాశం ఉందని అక్ష కాంబోజ్ తెలిపారు.వెండి ధర పెరుగుతున్నప్పటికీ, పెట్టుబడులు పెట్టేవారు సొంతంగా పరిశోధన చేసి, ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








