EPFO: మీ అకౌంట్లో పీఎఫ్ వడ్డీ పడలేదా..? మొబైల్ ద్వారా ఇంటి నుంచే కంప్లైంట్ చేసే అవకాశం.. ఒక్క ఫోన్ కాల్తో..
ఈపీఎఫ్ఓ ఇప్పటికే పీఎఫ్ వడ్డీని అందరి ఖాతాల్లో జమ చేసింది. దీంతో అందరూ ఈపీఎఫ్ పోర్టల్లోకి వెళ్లి తమకు పడిందా.. లేదా అనేది చూసుకుంటున్నారు. అయితే ఏదైనా సాంకేతిక కారణాలతో మీకు పడకపోతే ఫిర్యాదు చేయవచ్చు. ఆన్ లైన్ లేదా మెయిల్, హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ సభ్యులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వడ్డీని ఇప్పటికే జమ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 3 నుంచి జమ చేయడం ప్రారంభించగా.. జులై 15 వరకు అందరి ఖాతాల్లో క్రెడిట్ చేయడం పూర్తి చేసింది. దాదాపు అందరూ తమ పీఎఫ్ వడ్డీని అందుకున్నారు. పీఎఫ్ వడ్డీ పడిందా..? లేదా? అనేది ఖాతాదారులు చెక్ చేసుకుంటున్నారు. ఈపీఎఫ్ఓ ఇటీవల కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (CITES) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దీంతో పీఎఫ్ వడ్డీని వేగవంతంగా జమ చేసింది.సుమారు 34 కోట్ల ఖాతాలకు దాదాపు రూ. 1.44 లక్షల కోట్ల విలువైన వడ్డీ అందించింది. విడదల వారీగా అందరి అకౌంట్లలో వీటిని క్రెడిట్ చేసింది.
పీఎఫ్ వడ్డీ కోసం మీరు ఎలాంటి దరఖాస్తులు, క్లెయిమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాలెన్స్ను లెక్కించి ఆటోమేటిక్గా ఈపీఎఫ్వో మీ అకౌంట్లో వీటిని జమ చేస్తుంది. ఈపీఎఫ్వో వెబ్ సైట్లోకి వెళ్లి పాస్ బుక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ ఎంటర్ చేస్తే పోర్టల్ లాగిన్ అవుతుంది. ఆ తర్వాత మీ కంపెనీని ఎంచుకుంటే పాస్ బుక్ ఓపెన్ అవుతుంది. అందులో 2025 సెలక్ట్ చేసుకుంటే గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ అయిందా.. లేదా అనేది తెలుస్తుంది. అయితే ఏదైనా అనివార్య కారణాలు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు పీఎఫ్ వడ్డీ పడకపోతే ఆన్లైన్లో ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ పోర్టల్ https://epfigms.gov.in/grievance/grievancemaster అందుబాటులో ఉంటుంది. ఇందులోకి వెళ్లి మీ సమస్యను ఎంచుకుని ఫిర్యాదు చేయాలి. అధికారులు పరిశీలించి మీ సమస్యను పరిష్కరిస్తారు. ఇక ఈపీఎఫ్ఓ హెల్ప్ లైన్ నెంబర్ 14470ను సంప్రదించవచ్చు. అలాగే employeefeedback@epfindia.gov.inకు మీ సమస్యను మెయిల్ చేసి సహాయం పొందవచ్చు.
EPFO వార్షిక PF వడ్డీని ఎలా లెక్కిస్తుంది?
సంవత్సరాంతపు నిల్వపై వడ్డీని లెక్కిస్తారని చాలా మంది ఉద్యోగులు నమ్ముతారు. కానీ EPFO అలా పనిచేయదు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ప్రతి నెలా వాటాలు చెల్లిస్తారు కాబట్టి నెలవారీగా కొనసాగుతున్న నిల్వలపై వడ్డీని లెక్కిస్తారు. సంవత్సరంలో ఏదైనా డబ్బు ఉపసంహరించుకున్నా లేదా కొత్తగా వాటా చెల్లించినా వడ్డీ లెక్కింపు మారుతుంది. ఉదాహరణకు FY 2025, 2026 అంతటా PF ఖాతాలో సుమారు రూ. 5 లక్షలు ఉంచిన వ్యక్తి 8.25 శాతం వడ్డీతో దాదాపు రూ. 41,250 సంపాదించవచ్చు, అయితే వాస్తవ జమ నెలవారీ ఖాతా కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది.
