EPFO: పార్ట్టైమ్ ఉద్యోగులకు కూడా పీఎఫ్ సౌకర్యం.. కేంద్రం కీలక అడుగు.. వారికి కూడా అన్నీ బెనిఫిట్స్..
ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అదేంటంటే.. గిగ్ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు కూడా పీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సరికొత్త ఐటీ వ్యవస్థను రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీని వల్ల పీఎఫ్ పరిధి మరింత పెరగనుంది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఇటీవల కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల్లో అనేక మార్పుల చేస్తూ వస్తోంది. ఇటీవల కొత్త పీఎఫ్ పథకాలను ప్రవేశపెట్టగా.. తాజాగా మరో పెద్ద మార్పు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఫుల్ టైమ్ ఉద్యోగం చేసేవారికి మాత్రమే పీఎఫ్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరింత మందికి దీనిని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అదేంటంటే.. స్వయం ఉపాధి పొందేవారు, గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, అసంఘటిత రంగంలోని కార్మికులు స్వచ్ఛందంగా పీఎఫ్ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించాలని చూస్తోంది. దీని వల్ల వారికి కూడా పీఎఫ్ బెనిఫిట్స్ అందుతాయి.
గిగ్ కార్మికులకు కూడా పీఎఫ్
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉండగా.. ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఐటీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఈపీఎఫ్ఓ ఇటీవల టెండర్ను ఆహ్వానించింది. దీంతో దీని గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో చిన్న నంస్థలు, గిగ్ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కేంద్రం ప్రభుత్వం అందించే పీఎఫ్ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. దీంతో వారికి కూడా కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. స్వయం ఉపాధి నిపుణులు, వ్యాపార యజమానులు, ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ భాగస్వాములు, గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగంలోని కార్మికులుకు కూడా వర్తిస్తుంది.
యజమాని వాటా ఉండదు..
ఇప్పటి నిబంధనల ప్రకారం యజమాని, ఉద్యోగి ఇద్దరూ ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని ఈపీఎఫ్కు చెల్లిస్తారు. అయితే గిగ్ కార్మికులు, ఇతర సంస్థల్లో పనిచేసేవారి కోసం తీసుకొచ్చే పథకం స్వీయ నిధులతో నడిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఇందులో యజమాని వాటా ఏమీ ఉండదు. కార్మికులు తమకు వచ్చే సొంత ఆదాయం నుంచే చెల్లింపులు చేస్తారు. చెల్లింపులు కూడా సరళంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి రోజువారీగా, నెలవారీగా, వార్షికంగా లేదా ఎప్పుడైనా డబ్బు జమ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్ల వంటి క్రమరహిత ఆదాయాలు గల కార్మికులను లక్ష్యంగా చేసుకుంది.
