Online Gaming: ఆన్లైన్ గేమింగ్, జూదంపై 28 శాతం జీఎస్టీ.. బిల్లుకు కేబినెట్ ఆమోదం.. అప్పటినుంచే అమలు!
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కేంద్ర ప్రభుత్వం దాన్నే కాస్త మార్చి.. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ జీఎస్టీకి అనర్హం అంటోంది. ఆదాయం సమకూర్చుకునే ఏ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోదల్చుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ – GST) పరిధిలోకి మరికొన్నింటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆధునిక జీవితంలో ఒక భాగంగా మారిపోతున్న ఆన్లైన్ గేమింగ్తో […]

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కేంద్ర ప్రభుత్వం దాన్నే కాస్త మార్చి.. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ జీఎస్టీకి అనర్హం అంటోంది. ఆదాయం సమకూర్చుకునే ఏ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోదల్చుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ – GST) పరిధిలోకి మరికొన్నింటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆధునిక జీవితంలో ఒక భాగంగా మారిపోతున్న ఆన్లైన్ గేమింగ్తో పాటు క్యాసినో, గుర్రపు పందేలపై 28% జీఎస్టీని విధిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేయాలని కేంద్రం చూస్తోంది. గురువారం మొత్తం అవిశ్వాస తీర్మానంపై చర్చ, సమాధానంతోనే గడచిపోనున్న నేపథ్యంలో.. సమావేశాల చివరి రోజు ఆగస్టు 11న లోక్సభలో ద్రవ్య బిల్లుగా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది. ద్రవ్యబిల్లులకు లోక్సభ ఆమోదం సరిపోతుంది కాబట్టి ఈ బిల్లును గట్టెక్కించడం సమస్యే కాదు. పైగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్న ఈ మూడు రంగాల ద్వారా ఆదాయం సమకూరుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సానుకూలంగా స్వాగతించే అవకాశాలే ఎక్కువ.
మంత్రివర్గం ఆమోదం
ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాల్లో పూర్తి ముఖవిలువకు ఏకరీతిన 28% జీఎస్టీ విధించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తాజా బిల్లు ద్వారా జీఎస్టీ చట్టాన్ని సవరిస్తూ.. సీజీఎస్టీ, ఐజీఎస్టీతో పాటు యూటీ-జీఎస్టీలో మార్పులు చేయనుంది. జులై 11న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై కసరత్తు చేసి గరిష్ట పన్ను 28% విధించాలని నిర్ణయించారు. కాసినోల విషయంలో కొనుగోలు చేసిన చిప్లు లేదా కాయిన్ల ముఖ విలువపైన, గుర్రపు పందెం విషయంలో బుక్మేకర్ లేదా టోటాలిజేటర్ పెట్టే పందెం పూర్తి విలువపై, ఇక ఆన్లైన్ గేమింగ్లో బెట్టింగ్ పూర్తి విలువపై పన్ను వర్తింపజేయాలని ప్రతిపాదించారు. ఆగస్టు 2న జరిగిన కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలను షెడ్యూల్ IIIలో పన్ను విధించదగిన లావాదేవీలుగా చేర్చడానికి చట్టంలో తగిన సవరణలు చేయాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం లోతుగా అధ్యయనం చేసి అవసరమైన సవరణలను ఈ సమావేశంలో సిఫార్సు చేసింది. వాటి ఆధారంగా కేంద్రం బిల్లును రూపొందించింది.
సర్కారుకు దండిగా ఆదాయం




కేంద్రం సీజీఎస్టీ, ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ చట్టాలను సవరించిన తర్వాత, రాష్ట్రాలు, అసెంబ్లీతో కూడిన రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్జీఎస్టీ చట్టాలలో ఇలాంటి మార్పులను తీసుకురావాల్సి ఉంటుంది. 2023 అక్టోబరు 1 నుంచి అమలు జరిగేలా చూసేందుకు వచ్చే నెలాఖరులోగా ఈ చర్యలన్నింటినీ పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్ గేమింగ్ రంగం టర్నోవర్ 2022-23లో రూ. 85 వేల కోట్లుగా నమోదైంది. అయితే ఈ రంగం నుంచి గతేడాది ప్రభుత్వం బెట్టింగ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్ రూపంలో కేవలం 2% అంటే రూ. 1,700 కోట్లు మాత్రమే ఆదాయాన్ని గడించింది. కేసినోల నుంచి రూ. 800 కోట్లు, గుర్రపు పందాల నుంచి రూ. 80 కోట్లు వసూలయ్యాయి. అయితే వీటిపై 28% జీఎస్టీ విధించడం ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయం గడించే అవకాశం ఉంది. ఒక్క ఆన్లైన్ గేమింగ్ నుంచే ఏడాదికి రూ. 15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, రేస్ కోర్సుల నుంచి 28% గరిష్ట పన్ను విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గేమింగ్ కంపెనీలు తమ పరిశ్రమ దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు మూసేస్తున్నట్టు ప్రకటించగా, మరికొన్ని భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) సంస్థ 350 మంది ఉద్యోగులను తొలగించింది.
ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సృజనాత్మక ఆలోచనలతో ఈ రంగంలోకి వస్తున్న స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెల్లిస్తున్న పన్నులతో పోల్చితే 28% జీఎస్టీ అనేది 400 శాతం మేర పన్నుభారాన్ని పెంచుతుందని చెబుతోంది. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను జూదంతో ముడిపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




