పుట్టిన రోజు జరుపుకున్న కాసేపటికే అనంత లోకాలకు.. అన్నాచెల్లెళ్లతో సహా ముగ్గురిని బలిగొన్న పురాతన బిల్డింగ్
బిడ్డ పుట్టినరోజు ఆనందం అంతలోనే ఆవిరైంది. కన్నవారి స్వప్నాలను ఛిద్రం చేసింది విశాఖలోని పురాతన భవనం. కన్నుమూసి తెరిచేలోగా కన్నబిడ్డలు దూరమయ్యారు. పాత భవనం కుప్పకూలి ఒకే కుటుంబంలో అన్నాచెల్లెళ్ళతో పాటు మరోవ్యక్తి మృత్యువాత పడ్డారు.
బిడ్డ పుట్టినరోజు ఆనందం అంతలోనే ఆవిరైంది. కన్నవారి స్వప్నాలను ఛిద్రం చేసింది విశాఖలోని పురాతన భవనం. కన్నుమూసి తెరిచేలోగా కన్నబిడ్డలు దూరమయ్యారు. పాత భవనం కుప్పకూలి ఒకే కుటుంబంలో అన్నాచెల్లెళ్ళతో పాటు మరోవ్యక్తి మృత్యువాత పడ్డారు. ఈ అనూహ్య ఘటనతో విశాఖ తీరంలో విషాదం అలుముకుంది.విశాఖ నగరంలోని పాత రామజోగిపేటలో అర్థరాత్రి హఠాత్తుగా కుప్పకూలిన భవనం ఓ కుటుంబంలో అంతులేని విషాదంలో నింపింది…. ఆ ఇంటి ఆడపిల్ల పుట్టినరోజంటే అంబరాన్నంటే సంబరం…ఇంటిల్లిపాదీ రెక్కలు కట్టుకొని వాలిపోయారు అంజలి పుట్టినరోజు కోసం.. ఆడి పాడి ఆదమరచి నిద్రపోయారు. కానీ ఆ కుటుంబానికి అదే కాళరాత్రి అయ్యింది. గాఢనిద్రలోకి జారుకున్న కుటుంబంపై హఠాత్తుగా భవనం కుప్పకూలింది. అంతే కొద్ది గంటల క్రితం నిండు నూరేళ్ళు చల్లగా ఉండమంటూ అమ్మానాన్నల దీవెనలు అందుకున్న పదిహేనేళ్ళ అంజలి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ బిడ్డతో పాటు ఆమె సోదరుడి ప్రాణాలు సైతం తీసింది ఆ పురాతన భవనం. బీహార్కి చెందిన మరో వ్యక్తి సైతం ఇదే ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
ఆనందం ఆవిరి..
చేతికొచ్చిన బిడ్డలు..ఉన్నత చదువులు చదివి అమ్మానాన్నలకు ఆసరా అవుతారనుకున్న పిల్లలు..కన్నుమూసి తెరిచేలోగా కానరానిలోకాలకు తరలిపోయారు..నిద్రలేస్తూనే కలల కూనల మొహం చూడనిదే తెల్లవారదు ఆ తల్లిదండ్రులకు… అలాంటిది ఇక భవిష్యత్తులో ఏ ఉదయమూ తెల్లవారనీకుండా చేసింది ఆ పురాతన భవనం. అంజలి…దుర్గాప్రసాద్లను మృత్యువు కబళించడంతో ఆ కుంటుంబంలో శాశ్వత అంధకారం అలుముకుంది. ఇక ఇప్పుడు ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కావడంలేదు. తమ ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బతుకుతల్లీ అని అంజలిని దీవించిన కొద్దిగంటల్లోనే అదే చేతులతో అంత్యక్రియలు జరపాల్సిన దుర్భర సందర్భం వారి గుండెల్ని పిండేస్తోంది. అంజలి పదోతరగతి చదువుతోంది. దుర్గాప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు..బిడ్డల బంగారు భవిష్యత్తుపై కలలు కంటూ బతుకుతోన్న తల్లిదండ్రుల దుఃఖం వర్ణనాతీతం. ఆ కాళరాత్రి ఘటనతో విశాఖ సాగరతీరంలో విషాదం అలుముకుంది. పురాతన భవనం కుప్పకూలడంతో ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్ళు 15 ఏళ్ల అంజలి, 17ఏళ్ల దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. నిన్ననే అంజలి 15వ పుట్టిన రోజు. ఆ ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు. ప్రమాదం రూపంలో యావత్ కుటుంబం ఇప్పుడు శిథిల భవన శకలాల్లో తమ బిడ్డల జ్ఞాపకాలను తడుముకుంటోంది.
40 ఏళ్ల నాటి భవనం..
విశాఖ నగరంలోని పాత రామజోగిపేటలో ఈ ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంజలి తల్లి కళ్యాణి తలకు తీవ్ర గాయాలయ్యాయి… సర్జరీ కి రిఫర్ చేశారు వైద్యులు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో ఉన్న అంజలి తండ్రి…గుండెలు పగిలేలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఆయన్ను ఓదార్చడం ఎవరితరమూ కావడంలేదు. ఒక్కటో రెండో కాదు… నాలుగు దశాబ్దాల పురాతన భవనం… పునాదులు లేవు… పిల్లర్లు లేవు. దానికి తోడు సాగరతీరానికి దగ్గర్లో ఉన్న చవుడు భూమి… ఇసుక భూమిలో ఇల్లుకట్టాల్సినప్పుడు పాటించాల్సిన కనీస ప్రమాణాలు ఆనాడు పాటించన దాఖలాల్లేవు. అదే ఆ ఇంట్లో చీకట్లను నింపింది. ఉన్నఫళంగా కుప్పకూలేలా చేసింది. చుట్టూ గాఢాంధకారం. పెద్ద శబ్దం తప్ప ఇంకేమీ గుర్తులేదు. భారీ శబ్దంతో కుప్పకూలింది భవనం… తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని క్షతగాత్రులు చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన మిగిలిన కుటుంబ సభ్యులను కేజీహెచ్కి తరలించారు. బాధితుల రోదనలతో ఆసుపత్రి దగ్గర పరిస్థితి అత్యంత విషాదకరంగా మారింది.
ఉలిక్కి పడిన విశాఖ..
భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అటు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి. 40 ఏళ్ల నాటి భవనం కావడంతో వర్షాల వల్ల కూలిపోయిందని వివరణ ఇచ్చారు. అయితే భవనం రాత్రికి రాత్రే కుప్పకూలడానికి కారణం అది దశాబ్దాల పురాతనమైనది కావడంతో పాటు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు. నిర్మాణంలో ఉన్న భవనానికి అనుమతి ఉందా లేదా అనేది వెరిఫై చేస్తున్నామన్నారు జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు. పిల్లర్స్ లేకపోవడం… భవనం బరువు పెరగడం… వర్షాలకు గోడలు నానిఉండడం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్ పక్కనే మరో భవంతి నిర్మాణం కొనసాగుతోంది. ఇంకోవైపు పక్కనే బోర్వెల్ వేస్తుండడంతో వాటి వైబ్రేషన్స్ ప్రభావం ఉందా అనేవిషయంపై విచారిస్తోంది జీవీఎంసీ. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో నూడుల్స్ మాస్టర్గా పనిచేస్తోన్నకొమ్మిషెట్టి శివశంకర్ విజయవాడకు చెందిన వ్యక్తి. ఇటీవలే ఈ బిల్డింగ్లోకి మారారు.. అంతలోతనే ఈ ప్రమాదం జరగడంతో హడలిపోయారు. సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు క్రిష్ణ, సాతిక రోజారాణిలు గాయపడ్డ వారిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని, రక్షణ చర్యలు చేపట్టినట్టు స్థానికులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..