Telugu : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి.. ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు...

Telugu : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి..  ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Vp M Venkaiah Naidu
Follow us

|

Updated on: Jun 27, 2021 | 5:04 PM

Vice President Venkaiah Naidu : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు తెలిపారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏక తాటి మీదకు తీసుకు రావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిధిగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ నుండి వర్చువల్ విధానం ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.

వ్యక్తులనే గాక తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్న ఉపరాష్ట్రపతి, మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండో గొలుసు భాష-సంస్కృతులని తెలిపారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్న ఆయన, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు లాంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆహార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇందు కోసం తెలుగు వారందరూ తెలుగు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. మన మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే గాక, ఇతరుల భాషా సంస్కృతులను తప్పని సరిగా గౌరవించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్బండారు దత్తాత్రేయ, బెంగాల్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. శశి పంజా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డా. సి.ఎం.కె.రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి పి.వి.పి.సి ప్రసాద్ తదితరులు ఇంటర్నెట్  వేదిక ద్వారా వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు.

Read also : CPI Narayana : నా సలహా ఏంటంటే.. ‘కొత్తగా పెళ్లైన వాళ్లకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించండి’ : నారాయణ