Vizag: ఈ గసగసాలు గాడు మాములోడు కాదు.. పోలీసులు చెప్పిన షాకింగ్ విషయాలు
వాడి పేరు ధోని సతీష్ అలియాస్ గసగసాలు. రౌడీషీటర్. డమ్మీ తుపాకీతో కొంత మందిని బెదిరించి దారిదోపిడీలకు పాల్పడుతున్నాడు. సతీష్పై ఇప్పటి వరకు 30 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. జైలుకెళ్లి వచ్చినా బుద్ది మారలేదు. వన్టౌన్ ప్రాంతంలో దండుపాళ్యం బ్యాచ్ను తయారు చేసి.. నేరాలకు పాల్పడుతున్నాడు.

విశాఖలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ అతను.. చిన్న వయసులోనే నేరాలకు అలవాటు పడ్డాడు. చోరీలు, బెదిరింపులు, గంజాయి రవాణా, అత్యాచారంతో పాటు పలు కేసుల్లో నిండితుడిగా ఉన్నాడు. అంతేకాదు దండు పాళ్యం అనే బ్యాచ్ను ఏర్పాటు చేసి నేరాలు చేస్తుంటాడని పోలీసులు అంటున్నారు. ఆ నేరాల తీవ్రతకు తక్కువ వయసులోనే రౌడీషిట్ కూడా ఓపెన్ అయింది. తాజాగా మళ్ళీ ఓ బెదిరింపుల కేసులో బుక్కయ్యాడు ఈ నేరగాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోని సతీష్ అలియాస్ గసగసాలు.. ఈ పేరును తెలియని పోలీసు అధికారి విశాఖలో లేరు. వన్ టౌన్ లో రౌడీ షీటర్ అనగానే ధోని సతీష్ పేరు టక్కున వినిపిస్తుంది. అతనిపై నాలుగు వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. 30 వరకు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. 2022 లో గంజాయి కేసులో అరెస్ట్ అయిన ధోని సతీష్.. 2023 లో విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా మళ్లీ నేరాలు ప్రారంభించి.. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా, పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. తాజాగా పవన్ కుమార్ అనే వ్యక్తిని డమ్మీ తుపాకీతో బెదిరించి.. ఐ ఫోన్, 2500 నగదు తీసుకుని పరారాయ్యాడు. సతీష్కు మనోజ్ కుమార్ అనే మరో వ్యక్తి సహకరించాడు. వీరు డమ్మీ తుపాకీతో కొంత మందిని బెదిరించి దారిదోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. తాజాగా బాధితుడి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. డమ్మీ తుపాకీ, 2వేల 500 నగదు, 12 సెల్ ఫోన్లు, బైక్ సీజ్ చేశారు. రౌడీయిజం చేస్తున్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదంటున్నారు నగర శాంతిభద్రతల డీసీపీ–2 సత్తిబాబు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
