AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ

Indian Railway: ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన నగరాల మీదుగా ఈ సర్వీసులు ప్రయాణం చేస్తున్నాయి. తరచూ వేలమంది వీటిల్లో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా ఆ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ రైలు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ
Venkatrao Lella
|

Updated on: Dec 24, 2025 | 9:42 AM

Share

ఏపీలోని వందే భారత్ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ అందింది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను మరికొన్ని ప్రాంతాల వరకు ఇటీవల రైల్వేశాఖ పొడిగిస్తోంది. ఎక్కువమంది ప్రజలకు, అన్ని ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చేలా వీటి సర్వీసులను పొడిగిస్తుంది. అలాగే కొత్తగా మరికొన్ని స్టేషన్లలో ఆగేలా హాల్ట్ కల్పిస్తున్నారు. ఇటీవల తిరుపతి-విజయవాడ వందే భారత్ ట్రైన్‌ను నర్సాపురం వరకు పొడిగించగా.. తాజాగా ఏపీలోని ప్రయాణికులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అనంతపురం, సత్యసాయి జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

హిందూపురంలో ఆగనున్న వందే భారత్

యశ్వంత్‌పూర్-కాచిగూడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(20704/20703) ఇక నుంచి హిందూపురం రైల్వేస్టేషన్‌లో ఆగనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. దాదాపు రెండు నిమిషాల పాటు హిందూపురంలో ఆగనుంది. ఆ రోజున రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న హిందూపురంలో పచ్చజెండా ఊపి దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే డిప్యూటీ సీవోఎం ఎన్.రాజ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ నిర్ణయంతో హిందూపురం పరిసర ప్రాంతాల ప్రజలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్ ఇదే..

కాచిగూడ-యశ్వంత్ పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతీరోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు హిందూపురంకు చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.35 గంటలకు హిందూపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. హిందూపురం నుంచి తరచూ వేలమంది బెంగళూరు వెళ్తుంటారు. అలాంటివారికి ఈ ట్రైన్ బాగా ఉపయోపడనుంది. అత్యంత వేగంగా బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంటుంది.

స్థానిక ఎంపీ చొరవ

హిందూపురంలో వందే భారత్ ట్రైన్ ఆపాలని స్థానిక ఎంపీ పార్థసారధి రైల్వే అధికారులను కోరారు. ఆయన వినతితో స్థానిక ప్రజల అవసరాల కోసం హిందూపురంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపాలని రైల్వేశాఖ ఇటీవల నిర్ణయించింది. ఇప్పుడు ఎట్టకేలకు 27వ తేదీ నుంచి అందుబాటులకి తీసుకురానున్నారు. దీని వల్ల సత్యసాయి, అనంతపురం జిల్లాల ప్రజలకు లాభం జరగనుంది.