PM Narendra Modi: మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకలకు ప్రధాని మోడీ.. జులై 4న భీమవరం రాక..!
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (alluri sitarama raju) జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని సోము వీర్రాజు ప్రకటించారు.
PM Modi Likely to Visit Bhimavaram: ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే జనసేనతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (alluri sitarama raju) జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వస్తారని ప్రకటించారు. ప్రధాని మోడీ పర్యటన కోసం ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదించినట్లు వీర్రాజు వెల్లడించారు. శనివారం ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆకివీడు వచ్చిన సోము వీర్రాజు స్థానిక నాయకులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ పర్యటన, పార్టీ కార్యక్రమాలపై ఆయన వారితో చర్చించారు.
కాగా.. జూన్ 7న రాజమహేంద్రవరంలో జరగనున్న బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలపై నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరుస కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
కాగా.. ప్రధాని మోడీ ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలసిందే. ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ.. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం అని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..