Andhra Pradesh: అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం.. ఊహించని ప్రమాదంతో..
పండుగ పూట ఆ కుటుంబంలో ఊహించని ప్రళయం సంభవించింది. కాలక్షేపం కోసం వెళ్లిన రొయ్యల చెరువు గట్టే వారికి స్మశాన వాటికగా మారింది. వేగంగా తిరుగుతున్న ఏరియేటర్ ఐరన్ రాడ్కు చీర చిక్కుకోవడంతో.. కన్నతల్లితో పాటు ఆరేళ్ల పసిప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

పండుగ పూట ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. పుట్టింటికి వచ్చి సరదాగా గడుపుదామనుకున్న ఆ తల్లిని, కళ్ల ముందే ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు ఊహించని రూపంలో కబళించింది. రొయ్యల చెరువులో ఏరియేటర్ తిరిగే ఐరన్ రాడ్కు చీర కొంగు చిక్కుకోవడంతో.. తల్లి, ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఏలూరు జిల్లా దొడ్డిపట్ల గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాసరావుకు కలిదిండికి చెందిన వీరనాగ జ్యోతికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నాగజ్యోతి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆమె పెద్దకూతురు గుడికి వెళ్ళగా నాగజ్యోతి తన చిన్నకూతురు హేమతో కలిసి తండ్రి సాగు చేస్తున్న రొయ్యల చెరువుకు వెళ్లింది.ఈ క్రమంలో అక్కడే గట్టుపై ఉన్న ఇంజన్కు ఉన్న ఫ్యాన్ సెట్ రాడ్ దాటుతుండగా నాగ జ్యోతి బట్టలు దానికి చుట్టుకుపోయాయి. దీంతో ఆమెతో పాటు తన కూతురు హేమ సైతం అందులో చిక్కుకుపోయి రోల్ అవ్వటంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు వదిలారు.
సాధారణంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు చున్నీలు, పైట కొంగులు చక్రాల్లో పడటం చూస్తుంటాం. కానీ రొయ్యల చెరువుల వద్ద ఏరియేటర్స్ విషయంలోనూ ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని ఎవరూ ఊహించలేదు. గట్టుపై రాడ్లు తిరుగుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉండటం, వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం ప్రాణాంతకంగా మారింది. చెరువుల వద్ద ఏరియేటర్ రాడ్లకు రక్షణ కవచాలు లేకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. శివరాత్రి వేళ పుట్టింటికి వచ్చిన కూతురు, మనవరాలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో కలిదిండి మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
