Vizag: ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం.. ఆ ఆటోడ్రైవర్ చెప్పకపోయి ఉంటే
విశాఖలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు టైర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో అందరూ పరుగులు తీశారు. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులు అందరినీ కిందకు దించేశాడు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగుతున్నట్టు ఆటో డ్రైవర్ గుర్తించి బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

విశాఖలో పెను ప్రమాదం తప్పింది. 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ మంటలను గమనించి వేగంగా వెళ్లి బస్సు డ్రైవర్ను అలర్ట్ చేశాడు. దాంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ బస్సులోనుంచి దింపేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. శుక్రవారం ఉదయం కూర్మన్నపాలెం నుంచి బయలుదేరిన బస్సులో ఈ ప్రమాదం జరిగింది. అక్కయ్యపాలెం శాంతిపురం హైవే వద్ద బస్సును నిలిపేశారు. మంటలు చెలరేగుతున్న సమయంలో భారీ శబ్దంతో బస్సు టైర్లు పేలిపోయాయి. హైవేలో ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేసి.. మంటలను ఆర్పివేశారు. బస్సు నిలిపిన ప్రదేశంలో పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో మంటలు అటుగా వ్యాపిస్తాయేమోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అప్రమత్తమై పెట్రోల్ బంకులో పెట్రోల్ ఆపరేషన్స్ నిలిపివేయాలని సూచించారు. సిబ్బందిని ఖాళీ చేయించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అతి కష్టం మీద అదుపు చేశారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



