Andhra: తెలంగాణ నుంచి ఏపీలోకి దూసుకొచ్చిన లారీ.. అనుమానమొచ్చి ఆపి చెక్ చేయగా
హైవేపై ఓ లారీ వేగంగా దూసుకెళుతోంది. పోలీసులు తనిఖీలు చేసినా ఎలాంటి అనుమానం లేకుండా తప్పించుకుని ముందుకు దూసుకెళుతోంది లారీ. అయితే లారీలో ఎరువులు ఉండటంతో వ్యవసాయశాఖ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు... అంతే నకిలీ ఎరువులు తరలిస్తున్నట్టుగా గుర్తించారు... వెంటనే లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు... విచారణలో విస్తుగొలిపే సమాచారం బయటపడింది.

ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులో ఎప్పటిలాగే లారీలను తనిఖీ చేస్తున్నారు వ్యవసాయశాఖ అధికారులు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్, ఏవోలు బుజ్జి బాయ్, లక్ష్మీనారాయణలు మార్కాపురం నుంచి కంభం వైపు వెళ్ళే దారిలో లారీల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి అక్రమ రవాణపై దృష్టిపెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కాపురం నుంచి కంభం వైపు వెళుతున్న ఓ లారీని ఆపారు. లారీలో ఎరువులు గుర్తించారు. ఈ ఎరువులకు సంబంధించి డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడంతో ఎరువుల బస్తాలను పరిశీలించారు. అవి నకిలీవిగా తేలింది. వెంటనే లారీని స్వాధీనం చేసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి ఏపిలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ ఎరువులు సరఫరా చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఎరువుల కొరతను ఆసరా చేసుకుని తెలంగాణకు చెందిన కొంతమంది అక్రమార్కులు ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్ళి మంచి ఎరువులు ఉన్నాయని, 4 ఎరువుల బస్తాలు కొంటే ఒక పురుగుల మందు డబ్బా ఉచితం అంటూ ఆఫర్లు కూడా ప్రకటించారు. దీంతో అమాయక రైతులు అక్రమార్కుల మాటలు నమ్మి నకిలీ ఎరువుల మందులు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నకిలీ ఎరువుల వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే తెలంగాణ టూ ఏపీలోకి నకిలీ ఎరువుల అక్రమ దందా రాకెట్ వ్యవహారం పెద్ద ఎత్తున బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
