తెలుగుదేశం పార్టీలో మొదలైన ముసలం.. ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా
తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Jyothula nehru resigns: పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం టీడీపీలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు నిర్ణయం తనను, కార్యకర్తలను బాధపెట్టిందని పేర్కొన్నారు జ్యోతుల నెహ్రూ. ఇకపై పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారాయన.
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం నిరాశ కలిగించిందని చెప్పారు. అయితే, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జ్యోతుల నెహ్రూ భరోసా ఇచ్చారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని, ఎస్ఈసీ తీరును తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శుక్రవారం నిర్వహించే పార్టీల సమావేశంలో కూడా ఈ డిమాండ్ను బలంగా వినిపించాలని టీడీపీ భావించింది. అయితే, అఖిలపక్ష సమావేశం జరపకుండానే కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతు నెహ్రూ తెలుగుదేశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994,1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఆయన.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలుపొందారు. ఆ తర్వాత నెహ్రూ టీడీపీలో చేరిపోయారు. 2019లో జరిగిని అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంటిబాబు చేతిలో నెహ్రూ ఓటమి ఉభయ గోదావరి జిల్లాలో తీవ్ర హాట్టాఫిక్గా మారింది.
Read Also… తెలుగుదేశం పార్టీలో మొదలైన ముసలం.. ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా