Pawan Kalyan: ‘వాళ్లు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు’.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan: వ్యవస్థలను సక్రమంగా పని చేయిస్తే నేరాలు జరగవని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని మాట్లాడినందుకు అధికార పార్టీ నేతలు తనపై విరుచుకుపడ్డారని పవన్ తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా తాను చెప్పింది నిజమని తేలిందని, ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారని దీన్ని స్వయంగా నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యర్థి చెప్పారని పవన్ అన్నారు. అసలు చిన్నారుల అక్రమ రవాణాకు..

Pawan Kalyan: ‘వాళ్లు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు’.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 12, 2023 | 7:13 PM

విశాఖపట్నం, ఆగస్టు 12: విశాఖలో బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని ఓ వాలంటీర్ హత్య చేసి పది రోజులు కావొస్తున్న ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం తరఫున ఒక్కరూ ఆమె కుటుంబాన్ని పరామర్శించలేదని, పాలకుల ఆలోచన విధానం ఏమిటో ఈ విషయంలోనే అర్థమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పెందుర్తి సుజాతనగర్‌లో జరిగిన ఈ ఘటనలో వరలక్ష్మి(73) మరణించగా.. ఆమె కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సమయంలో జనసేనానితో నాదెండ్ల మనోహర్ సహా ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ‘వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది వాలంటీర్లు నేరాలకు పాల్పడుతున్నారు. పాస్ పోర్టు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగానికైనా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. కానీ వాలంటీర్ అనే ఈ సమాంతరం వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయడం లేదు..? వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికొదిలి తయారు చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి మరీ సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు..? వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయి. వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో.. క్షేత్రస్థాయిలో వారు రెచ్చిపోతున్నార’ని పేర్కొన్నారు.

వ్యవస్థలను సక్రమంగా పని చేయిస్తే నేరాలు జరగవని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని మాట్లాడినందుకు అధికార పార్టీ నేతలు తనపై విరుచుకుపడ్డారని పవన్ తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా తాను చెప్పింది నిజమని తేలిందని, ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారని దీన్ని స్వయంగా నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యర్థి చెప్పారని పవన్ అన్నారు. అసలు చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో, మాయమైన చిన్నారులు ఏమవుతున్నారో కూడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని.. పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకోవాలని, క్రైమ్ రేటు తక్కువగా ఉండే ప్రశాంత విశాఖ నగరంలోనే నేడు హ్యుమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇంకా ‘రాష్ట్రంలోని వ్యవస్థలను సక్రమంగా పని చేయనిస్తే ఇలాంటి నేరాలే జరగవు. వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడుకోవడమే జనసేన లక్ష్యం. చిన్న పిల్లలు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న చోట ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. స్టేషన్‌కు వెళ్లలేకపోతే సోషల్ మీడియాలోనైనా వివరాలు పోస్టు చేయండి. అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలోని శాంత్రిభద్రతల సమస్యపై స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రక్షణ లేకుంటే ఉమ్మడిగా, రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పాలకపక్షంపై పోరాడాల్సిన సమయం ఇద’ని పవన్ పిలుపునిచ్చారు.

నాయకులే రౌడీలతో మిలాఖత్..

విశాఖలో లా అండ్ అర్డర్ దిగజారిన కారణంగానే ఎంపీ కొడుకు, భార్యను కిడ్నాప్ చేశారని, అయితే ఆ కిడ్నాప్ చేసినేవారినే ఎంపీ వెనకేసుకొస్తారని, వీరంతా ఒక్కటైపోయారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఎంపీ కుటుంబం పరిస్థితే ఇలా ఉన్న నేపథ్యంలో ఓటు వేసే ముందు ఓ సారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, నానాటికీ దిగజారిపోతున్న పరిస్థితిని తప్పకుండా ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తానని, వృద్ధ మహిళ వరలక్ష్మిని హత్య చేసిన నిందితుడికి శిక్ష పడేవరకు ఆమె కుటుంబ సభ్యులకు న్యాయపరమైన మద్దతు అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

పెందుర్తిలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వీడియో దిగువన చూడండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..