Pawan Kalyan: బీసీల కోసం దీక్షకు సిద్ధం.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
హక్కుల కంటే ముందు బీసీలంతా ఐక్యత సాధించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీసీల కోసం దీక్షకు సిద్ధమన్న పవన్.. జనసేన అధికారంలోకి వస్తే 50శాతం పదవులు వాళ్లకే ఇస్తామన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్స్ని తెరమీదకు తీసుకొచ్చారు. అధికారంలోకి రావాలంటే కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలన్నారు. ఆ రెండు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్న పవన్.. ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరమే ఉండదన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని బీసీ కులాలన్నీ కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కాలేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కు ఎందుకు పెరిగాయంటూ పవన్ ప్రశ్నించారు. హక్కుల కంటే ముందు బీసీలంతా ఐక్యత సాధించాలని ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. బీసీల కోసం దీక్షకు సిద్ధమన్న పవన్.. జనసేన అధికారంలోకి వస్తే 50శాతం పదవులు వాళ్లకే ఇస్తామంటూ హామీ ఇచ్చారు.
ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అటు టీడీపీ బీసీల ఓట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో బీసీలు చాలా వరకు దూరం కావడంతోనే ఓటమిపాలయ్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే టీడీపీ బీసీల పార్టీ అని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.
ఇటు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్.. బీసీ కులాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తండ్రీకొడుకులిద్దరూ బీసీ మంత్రం జపిస్తున్నారు. లేటెస్ట్గా పవన్ కూడా బీసీల ఓట్లకు గాలం వేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు బీసీల చుట్టూ టర్న్ అయ్యాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..