Andhra Pradesh: ఈ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నారా..? క్లారిటీ ఇచ్చిన వేణుగోపాల్
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ భగ్గుమంటూనే ఉంటాయి. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా పార్టీల మధ్య రోజూ ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా..

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ భగ్గుమంటూనే ఉంటాయి. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా పార్టీల మధ్య రోజూ ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. వైసీపీలోనే ఉంటా.. మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జరుగుతున్న ప్రచారంపైనా కౌంటర్ ఇచ్చారాయన.
దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీని వీడుతారా..? ఎందుకు వీడుతున్నారు..? ఏ పార్టీలోకి వెళ్తున్నారు? ఈ ప్రశ్నలు నియోజకవర్గంలో హోరెత్తాయి. ఈ క్రమంలో ఆయన నేరుగా సీన్లోకి వచ్చారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఇప్పటికీ ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని.. జగన్కు మద్దతుగానే ఉంటానన్నారు. దర్శిలో జగన్కు మద్దతుగా నిలబడి ఎన్నికల్లో గెలిచానన్నారు వేణుగోపాల్. తనకున్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకుంటూ నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తానన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన గడప గడపకు తిరుగుతూ వివరిస్తున్నానని అన్నారు. కేవలం తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కారణంగానే కార్యకర్తలకు దూరంగా ఉన్నానని.. ఈ మాత్రం దానికే చాలామంది పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారని వివరించారు వేణుగోపాల్.
వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ముందుగా వైసీపీ గెలిచే సీటు దర్శినే అన్నారు. దర్శి పట్టణంలో మంచినీటి సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడం.. గెలవడం ఖాయమన్నారు. కార్యకర్తలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు వేణుగోపాల్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







