MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఘట్టం.. సోమవారం నాటి పోలింగ్కు సర్వం సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ MLC స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ MLC స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగే ఎన్నికలకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖలో గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ వెంటనే ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీలో హోరా హోరీ..
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు ముమ్మరంగా ప్రచారం చేశారు. దీంతోపాటు ప్రభుత్వానికి, తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోన్న ఉపాధ్యాయ సంఘాల్లో భారీగా చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతోపాటు గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఓటర్లకు భారీగానే తాయిలాలు పంపిణీ చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు PDF అభ్యర్థులు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నట్లు సమాచారం. ఆ అభ్యర్థులకు గతంలో మద్దతు ఇచ్చిన కొన్ని సంఘాలు అధికారపక్షం, ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా జరుగుతోంది. కొందరు ఓటుకు 3 నుంచి 5 వేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్షాపులు బంద్ చేయడంతోపాటు పోలీసు బందోబస్తు పెంచారు.
తెలంగాణలోనూ..
ఇక మార్చి 13న తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో 126 మెయిన్ కేంద్రాలు కాగా.. మిగతావి అదనంగా ఏర్పాటు చేశామన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
