Konijeti Rosaiah: అజాత శత్రువు.. ఆర్థిక నిపుణుడు.. రాజకీయ ప్రజ్జాశీలి.. రోశయ్య మృతిపట్ల ప్రముఖుల సంతాపం

రోశయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నివాళ్లు తెలిపారు

Konijeti Rosaiah: అజాత శత్రువు.. ఆర్థిక నిపుణుడు.. రాజకీయ ప్రజ్జాశీలి.. రోశయ్య మృతిపట్ల ప్రముఖుల సంతాపం
Rosaiah
Follow us

|

Updated on: Dec 04, 2021 | 1:26 PM

Konijeti Rosaiah:  ఆయనో మాటల మాంత్రికుడు. ఆర్థికరంగ నిపుణుడే కాదు.. మాటలతో చెడుగుడు ఆడుకొనే తీరు ఆయన సొంతం. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేసే రోశయ్య.. మాటలతో తూటాలు కూడా పేల్చేవారు. ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని హ్యాండిల్‌ చేసేవారు. ఇప్పటి రాజకీయాలు వేరు.. వైఎస్‌ నాటి రాజకీయాలు వేరు. అప్పట్లో రాజకీయంగా హుందాతో కూడిన విమర్శలుండేవి. ఆ హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం మాజీ సీఎం రోశయ్య. ఆయన విమర్శలు విలువలతో కూడుకున్నవి. ఆ మాటలు అందరినీ ఆలోచింపజేసేలా ఉండేవి.. రోశయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా నివాళ్లు తెలిపారు నేతులు.

రోశయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలిపారు. తాను గుజరాత్‌ సీఎంగా పనిచేసిన సమయంలోనే రోశయ్య ఏపీ సీఎంగా పనిచేశారని, అప్పట్లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని అన్నారు. తమిళనాడు, కర్నాటక గవర్నర్‌గా పనిచేసినప్పుడు కూడా రోశయ్యను కలిసినట్టు తెలిపారు.

మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావ్‌తో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను రాహుల్‌కు కేవీపీ వివరించారు.

రోశయ్య మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక రోశయ్య అని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కొనియాడారు.

రోశయ్య మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ఫ్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని గౌరవ గవర్నర్ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు.

మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రోశయ్య మృతి పట్ల కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అజాతశత్రువు గా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి అని కొనియాడారు. జనసంఘ్ (పూర్వ బిజెపి) లో శాసనమండలి సభ్యులుగా వి రామారావు గారి తో పాటు అందరికి రోశయ్య గారితో అనుబంధం ఉండేది. పార్టీలు వేరైనా కలిసి పనిచేయడం వారి నైజం అయనదన్నారు.

రోశయ్య మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు.

రోశయ్య అకాల మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి శిష్యుడు రోశయ్య అని అన్నారు.

రోశయ్యగారి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు. రోశయ్య మరణం దురదృష్టకరం. ఉమ్మడి‌ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్యది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంటేరీయన్ గా, వివిధ‌శాఖలకు మంత్రిగా, అంధ్రప్రదేశ్ ‌ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా పదవులకు వన్నె తెచ్చిన అపార రాజకీయ ప్రజ్ఞాశాలి అన్నారు.స్వపక్షం.. విపక్షం తేడా లేకుండా మిత్రులను సంపాదించుకున్న అరుదైన రాజకీయ వేత్త. అసెంబ్లీ లో నేను తొలి సారిగా మంత్రిగా మాట్లాడితే పిలిచి అభినందించారు. మంచి భవిష్యత్ ఉందని చెప్పారు.. చక్కగా సమాధానం చెప్పావని ప్రోత్సహించారని హరీష్ తెలిపారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని హరీష్ రావు గుర్తు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని మంత్రి కేటీ రామారావు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ సీఎం రోశయ్య ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. లో-బీపీతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచారు.

రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన రోజులను సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని సబిత తెలిపారు.

రోశయ్య మరణం తీర్చలేని లోటు అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. నిరాండబరుడు, నిగర్వి అయిన రోశయ్య లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు బొత్స తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రోశయ్య అకాల మరణం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ చతురత కలిగిన సీనియర్ నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు రోశయ్య అని అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానన్నారు.

రోశయ్య మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల మనిషి ప్రజల నుండి దూరమవడం చాలా బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో ఇరువురు చాలా కాలం కలిసి పని చేసిన రోజులను సీహెచ్ గుర్తు చేసుకున్నారు. శాసనసభలో తమ మధ్యన జరిగిన చర్చలలో ఎన్నో సందర్భాలలో నవ్వులు పూయించిన సందర్భాలున్నాయని…ఇది ఎన్నటికీ మరువలేనని తెలిపారు. రోశయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ…కుటుంబసభ్యులకు విద్యాసాగర్‌రావు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మచ్చలేని రాజకీయ యోధుడు రోశయ్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటన్నారు. నిష్కళంక రాజకీయ యోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. తనకు రోశయ్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆయన మరణం తనను వేదనకు గురి చేసిందన్నారు.

రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరు అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు. కాగా.. రోశయ్య కుమారుడితో సైతం రేవంత్ ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు.

ఉమ్మడి ఏపీ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లుగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య ఇక లేరన్న వార్త బాధిస్తోందని గంటా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సమున్నత వ్యక్తిత్వం, విషయపరిజ్ఞానం కలిగి, విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య అన్నారు.

రోశయ్య మృతికి శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వక్త, ఆర్ధిక మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడు, అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఘనత ఆయనదే అని అన్నారు. రోశయ్య మృతితో రాష్ట్రం గొప్ప అనుభవశాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమకాలీన రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న నేత రోశయ్య. రాష్ట్ర రాజకీయాల గతిని మార్చిన ఆయన చనిపోవడం బాధాకరమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు.

అన్ని పార్టీల నేతలు.. రోశయ్యను గౌరవిస్తారని అన్నారు అంబికా కృష్ణ. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తండ్రి సమానులైన.. గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. గాంధీభవన్‌తో ఆయనకు అరవై సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.

రోశయ్యతో 30 ఏళ్లుగా అనుబంధం ఉందని పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రోశయ్య నిబద్ధత కలిగిన వ్యక్తి, మార్గదర్శి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించారన్నారు. రోశయ్య లేకపోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్న ఆయన రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ సీఎం రోశయ్య శివైక్యం చెందడం కలచివేసిందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆధ్యాత్మికతకు రోశయ్య అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించారని తెలిపారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

ప్రశాంతంగా ముఖ్యమంత్రి పదవి చేయకుండా రోశయ్యను హింసించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. రోశయ్యను అందరూ ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారు. తనకు ప్రశాంతంగా పనిచేసుకునివ్వలేదన్న బాధ రోశయ్యకుండేదని తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. రోశయ్య నిజమైన కాంగ్రెస్ వాది అని చెప్పుకొచ్చారు. ఆయన కుంటుంబానికి వీహెచ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం