Watch Video: నీటిపై పచ్చని పందిరి.. పందిరిపై ముత్యాల రాశి.. ఈ సౌందర్యం చూసేందుకు తరలి వస్తున్న జనం..
ఆ సుందర దృశ్యం అటువైపుగా వెళుతున్న పాదాచారుల్ని, వివాహనదారుల్ని కట్టిపడేస్తుంది. కాసేపైనా ఆ రమణీయమైన ప్రకృతి సుందర రూపాన్ని చూసి తీరాల్సిందేనని ఆ దృశ్యాన్ని చూసిన ప్రకృతి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. భూమిపై పచ్చదనం కప్పి ముత్యాలు దానిపై పోసినట్టుగా మధ్యలో కలువల సోయగాలకు స్థానికులు మంత్రముగ్ధులవుతున్నారు.
ఏలూరు, మార్చి 23: ఆ సుందర దృశ్యం అటువైపుగా వెళుతున్న పాదాచారుల్ని, వివాహనదారుల్ని కట్టిపడేస్తుంది. కాసేపైనా ఆ రమణీయమైన ప్రకృతి సుందర రూపాన్ని చూసి తీరాల్సిందేనని ఆ దృశ్యాన్ని చూసిన ప్రకృతి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. భూమిపై పచ్చదనం కప్పి ముత్యాలు దానిపై పోసినట్టుగా మధ్యలో కలువల సోయగాలకు స్థానికులు మంత్రముగ్ధులవుతున్నారు. అయితే అది పర్యాటక కేంద్రం కాకపోయినా దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఈ ప్రదేశం. ఇంతకీ అది ఏమై ఉంటుంది అనే కదా మీ సందేహం. ఆ వివరాలే ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కుకునూరు శివారులో ఓ చెరువు ఉంది. ప్రస్తుతం మనం ఆ చెరువు దగ్గరికి వెళితే నిజంగా అక్కడ చెరువు ఉన్న ఆనవాళ్లు ఏమి మనకు కనిపించవు. ఎందుకంటే ఆ చెరువు మొత్తం పచ్చని ఆకులు పరచినట్టుగా తామర పుష్పాలతో కళకళలాడుతూ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కుకునూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే రహదారి పక్కనే ఈ చెరువు ఉంది. అటువైపుగా వెళ్లే వాహనదారులందరూ ఆ చెరువు గట్టుపై ఆగి మరీ కాసేపు అక్కడ సేదతీరి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు.
తామర ఆకులు చెరువు అంతా వ్యాపించి, మధ్యలో లేత గులాబీ రంగులో సుందరమైన తామర పుష్పాలు వికసించి, ఆ పచ్చని ఆకులపై ముత్యాల లాగా నీటి బొట్లు అటు ఇటు జారుతు నృత్యం చేస్తున్నట్లుగా ఈ ప్రదేశం ఉంది. సహజంగా తామర పువ్వులను లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తారు. అంతేగాక వినాయక చవితితోపాటు మరికొన్ని ప్రత్యేక పండుగలకు ఈ తామర పుష్పాలను విరివిగా వాడతారు. తామర పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో వాటిని దక్కించుకోవాలంటే ఒక రకమైన సాహసం చేయాల్సిందే. తామర పువ్వులు కొస్తూ ప్రమాదాల బారినపడి మరణించిన వారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే తామర పువ్వు లోతుగా ఉన్న నీళ్లలోనే ఎక్కువగా బ్రతుకుతుంది. పూల కోసం చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తామర తీగల ఉచుల్లో చిక్కుకుంటారు. చెరువులోపల తామర తీగలు ఉచ్చులా అల్లుకుపోయి ఉంటాయి. ఈదుతూ వెళ్లినా మనిషిని చుట్ట చుట్టి ముంచేస్తాయి. అడుగులో అడుగేస్తూ వెళ్లినా బురదలో కూరుకుపోతే మాత్రం బయటకు రావడం అంత తేలిక కాదు. అయినా సరే, కొందరు యువకులు ఈ సాహసానికి పూనుకుంటున్నారు. ఉపాధి కోసం లోతైన నీటిలోకి వెళ్లి మొగ్గలను కోస్తుంటారు. రక్షణ కోసం కొందరైతే నడుముకు తాడు కట్టుకుని నీటిలోకి దిగుతారు. అడుగులో అడుగు వేస్తూ.. లోతు ఎక్కువగా ఉన్నచోట నెమ్మదిగా ఈదుతూ.. పువ్వులు, మొగ్గలను తెంచుకుని గట్టుకు చేరుతారు. తామర పువ్వు ఎంత అందమో.. దానిని పొందాలన్నా అంతకు మించిన సాహసం చేయాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..