AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం మరో టర్న్.. ఎమ్మెల్యే రాచమల్లు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం..

Andhra Pradesh: ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఈ సారి టిప్పు విగ్రహ వివాదం ముదురి

Andhra Pradesh: టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం మరో టర్న్.. ఎమ్మెల్యే రాచమల్లు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం..
Mla Vs Bjp
Shiva Prajapati
|

Updated on: Aug 01, 2021 | 10:06 PM

Share

Andhra Pradesh: ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఈ సారి టిప్పు విగ్రహ వివాదం ముదురి మరో టర్న్ తీసుకుంది. రాజకీయ ఆరోపణలు నుంచి వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఎమ్మెల్యే రాచమల్లు, బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం టు ఉండడంతో ప్రొద్దుటూరు రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఇంతకీ ఈ వివాదం ఎక్కడ మొదలయ్యింది..? వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదం ఇప్పుడు వైసీపీ, బీజేపీ పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చు రేపింది. పార్టీల మధ్య రేగిన చిచ్చు కాస్తా.. నాయకుల వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రౌడీ లాగా వ్యవహరిస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని, హత్యా రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు.. విష్ణువర్ధన్ రెడ్డి ఒక పెద్ద దొంగ, దోపిడీదారుడు పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో బంగారం, డబ్బు దోచుకున్నాడని కౌంటర్ అటాక్ చేశారు. ఇంతకీ ఈ రేంజ్‌లో వ్యక్తిగత దూషణలకు పాల్పడటానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే.. 2021 జూన్ 13 వ తేదీన ప్రొద్దుటూరు జిన్నారోడ్డు సర్కిల్లో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, విగ్రహ కమిటీ సభ్యులు భూమిపూజ చేశారు. అంతే ఆ మరుసటి రోజు నుంచే అసలు కథ మొదలు అయ్యింది.

టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు భూమిపూజ విషయం తెలుసుకున్న బీజేపీ ప్రొద్దుటూరు నాయకులు.. విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని మార్చుకోవాలని జూన్ 14 వ తేదీన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో జూన్ 17 వ తేదీన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టిప్పుసుల్తాన్ స్వతంత్ర సమరయోధుడు అని, విగ్రహ ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు, కామెంట్స్ చేయడంతో వివాదం ఇంకాస్త ఎక్కువ అయ్యింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం జూన్ 18 వ తేదీన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును ఆపాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ కు వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం విగ్రహ ఏర్పాటు స్థలాన్ని సందర్శించేందుకు వెళుతుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని జూన్ 21 వ తేదీన బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రాన్ని అందచేశారు. అయితే, పాలక వర్గం మాత్రం జూన్ 30 వ తేదీన ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కి పంపించారు.

ఇక దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా కడపజిల్లాకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు.. జులై 27 వ తేదీన చలో ప్రొద్దుటూరు పేరుతో మున్సిపల్ కార్యాలయం వద్ద టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోనే విగ్రహ ఏర్పాటు చేసే జిన్నారోడ్డు సర్కిల్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీనిపై జులై 28 వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు.. మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అనుమతి తీసుకొని విగ్రహ ఏర్పాటు చేస్తానని, బీజేపీ నేతలు అడ్డుచెప్పినంత మాత్రాన ఆపేది లేదని తెగేసి చెప్పారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, కావాలనే హిందువులు ఓటు బ్యాంకు కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. సమసిపోయిన సమస్యను కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విగ్రహం ఏర్పాటుకు పూజ చేసిన తర్వాత కౌన్సిల్ తీర్మానం చేసారని, రాచమల్లు మతిలేక మాట్లాడుతున్నారని సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. దీంతో రాజకీయ వివాదం కాస్త వ్యక్తిగత వివాదంగా మారిపోయింది. సోము వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. సోము వీర్రాజు నోటి దురుసు ఎక్కువ అయ్యిందని, ఆ దురుసును తగ్గించే బాధ్యత తనపై ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో వివాదం మరో టర్న్ తీసుకుంది.

దీనికి తోడు జులై 29 వ తేదీన రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామంలో ప్రభుత్వ పథకాలు అందడం లేదని వైసీపీ, బీజేపీ నాయకులు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా.. వారిని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారణం ఎమ్మెల్యే రాచమల్లే అని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లు.. హత్యా రాజకీయాలు, హింసను ప్రేరేపిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బావమరిదిపై కేసులు ఉన్నా కూడా అతనిని మున్సిపల్ వైస్ చైర్మన్‌ను ఎలా చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్‌పై ఎమ్మెల్యే రాచమల్లు తీవ్రంగా స్పందించారు.. ఆయన ఒక దొంగ, దోపిడిదారుడు అంటూ వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. దీంతో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం.. రాజకీయాల నుంచి వ్యక్తిగత ఆరోపణల దిశగా టర్న్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం.. ఎమ్మెల్యే రాచమల్లు వర్సెస్ బీజేపీ గా మారింది. అయితే వ్యక్తిగత ఆరోపణల వ్యవహారం వైసీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాచమల్లు, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందా?.. ఇది ఎంతవరకు వెళ్తుందో.. దేనికి దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also read:

YS Sharmila: మొయినాబాద్‌లో తన స్నేహితురాలితో కలిసి బోన‌మెత్తిన వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల

Youth Gang War: స్నేహితులదినోత్సవం రోజున స్నేహం మరచి కర్రలతో దాడి చేసుకున్న యువకులు.. వీడియో వైరల్

Deer Fight: రెండు కాళ్ళు ఎత్తి .. కొమ్ములతో కుమ్ముకున్న రెండు ఆడ జింకలు.. ఆడోళ్ళు కదా అంటూ ఫన్నీ కామెంట్స్

Follow Us