AP Capital: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. ఆ బిల్లుపై వెనక్కి..

AP Capital: అనుకుందే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ...

AP Capital: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. ఆ బిల్లుపై వెనక్కి..
Ap Bill
Follow us

|

Updated on: Nov 22, 2021 | 3:35 PM

AP Capital: అనుకుందే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే CRDA రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు స్పీకర్‌ అనుమతివ్వడంతో బుగ్గన ఈ విషయాన్ని సభలో తెలిపారు.

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్లు అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే. బిల్లుపై బుగ్గన మాట్లాడుతూ.. ‘కేంద్రం సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి ఒకే చోట సంస్థలన్నింటినీ ఏర్పాటు చేయడం వల్లే వేర్పాటు వాదం వచ్చింది. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికపై చర్చే జరగలేదు’ అని తెలిపారు.  బాహుబలి తరహాలో రాజధాని కట్టాలని గత ప్రభుత్వం అబాసుపాలైందని విమర్శించారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. రాజధాని 7,500 చదరపు కిలోమీటర్లు పరిధిలో కట్టాలనుకున్నారని…ఆర్థిక రాజధాని ముంబై సిటీయే 4,300 చదరపు కిలోమీటర్లు ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తు ఆర్థిక అంచనాలు లేకుండానే రాజధాని కట్టాలనుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బుగ్గన. సీఆర్‌డీఏకు బదలాయించిన ఉద్యోగులను తిరిగి బదిలీ చేస్తున్నట్లు బుగ్గన రాజేందర్ స్పష్టం చేశారు.

పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణకమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని మంత్రి బుగ్గన అన్నారు. కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదన్నారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యం. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు.

మూడు రాజదానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ఆనందం వ్యక్తం చేస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు రైతులు, మహిళలు.

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. న్యాయపరమైన చిక్కుల వల్లే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఇంటర్వెల్‌ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉందన్నారు. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్‌ ఆర్టిస్టులే అని మంత్రి పెద్దిరెడ్డి మరోసారి అమరావతి రైతులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే విషయంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రాజధాని వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న మంత్రి.. కొందరు కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించారన్నారు. అమరావతిపై ఏపీ కేబినెట్‌లో చర్చించామని.. మంత్రి మండలి నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరించామని మంత్రి కొడాలి నాని అన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు.

ఇదిలావుంటే ప్రభుత్వ౦ ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్నపాత్రుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అని అయ్యన్న ప్రశ్నించారు. విశాఖ రాజధాని పేరుతో ఇక్కడ భూములు దోచుకునే ప్రయత్నం చేశారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

రాజధానుల విషయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. మొదటి నుంచి అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇది అమరావతి రైతులు , రాష్ట్ర ప్రజల విజయమన్నారు. అలాగే, కర్నూలులో హైకోర్టు కట్టాలని మా డిక్లరేషన్‌లో ఉందని గుర్తు చేసిన వీర్రాజు.. రాయలసీమ డిక్లరేషన్ పై కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమలో వైసీపీ నాయకులకు నోరుమెదిపే ధైర్యంలేదన్నారు. వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని సోము వీర్రాజు భరోసా ఇచ్చారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు బార్ అసోషియేషన్ సభ్యులు. న్యాయ రాజధాని విషయంలో కర్నూలుకు అన్యాయం జరిగితే జరగబోయే పరిణామాలు ఊహించలేమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించగానే టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నాం.. ఇప్పుడు ఆ నిర్ణయం అమలు కాకపోతే ఉద్యమిస్తామంటున్నారు అడ్వకేట్లు. తిరిగి న్యాయ రాజధాని దక్కకపోతే అంతే స్థాయిలో లో రిటాలియేషన్ ఉంటుందని కర్నూలు అడ్వకేట్ వారి అసోసియేషన్ హెచ్చరించింది.

అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి..

Latest Articles