Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళా న్యాయవాదులు.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు..
Andhra Pradesh: సామాజిక బాధ్యత తెలియని దర్శకుడు రాంగోపాల్వర్మ అని మహిళా న్యాయవాదులు మండిపడ్డారు. మహిళలను విలాస వస్తువుగా భావించే వర్మపై న్యాయపోరాటం చేస్తామన్నారు. నాగార్జున వర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పెదకాకాని పీఎస్లో ఫిర్యాదు చేశారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు గుంటూరుజిల్లా పెదకాకాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మతో పాటు ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల నాగార్జునవర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్లో డైరెక్టర్ ఆర్జీవీ అసభ్యకరమైన రీతిలో మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు పత్రం అందజేశారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిగా వర్మ వ్యవహరించారని విమర్శించారు. ప్రపంచంలో మగవారంతా చనిపోయి వర్మ మాత్రం మిగిలి ఉండాలన్న ఆయన వాదనను మహిళా న్యాయవాదులు ఖండించారు. విద్యార్థులుండే ఇలాంటి వేదికపై రాంగోపాల్ వర్మను రప్పించిన వీసీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పెదకాకాని సీఐ సురేశ్ బాబు.. న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులో ముందుకువెళ్తామని చెప్పారు.
యూనివర్సిటీలో ఆర్జీవీ మాట్లాడిన తీరు మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉందన్నారు మహిళా న్యాయవాది లక్ష్మీ సుజాత. 25ఏళ్లు పూర్తయిన తర్వాత ఆయనకు పట్టాతో ఏం అవసరం వచ్చిందో..? ఆయన్ను పిలిపించాల్సిన అవసరం ఏం వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్జీవీ, వీసీపై చర్యలు తీసుకునేవరకూ న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఈనెల 15న గుంటూరు నాగార్జున వర్శిటీలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కోసం పంపించిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..