Andhra Pradesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్.. మరో 10 రోజుల్లో కోర్సు పూర్తి! ఇంతలో దారుణం
తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మరో విద్యార్ధిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది..
వేంపల్లె, ఏప్రిల్ 15: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరుసగా అకడమిక్, ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మరికొందరు పరీక్ష బాగా రాయలేదని, ఫలితాలు ఎలా వస్తాయోనని.. ఇలా పలు కారణాలతో స్వంత నిర్ణయాలు తీసుకుని నిండు జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఎందరో విద్యార్ధులు పరీక్షల ఒత్తిడి భరించలేక తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని మిగిల్చారు. తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మరో విద్యార్ధిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు గానీ ఆదివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనలో రేఖ కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడింది. గమనించిన తోటి విద్యార్థులు, ట్రిపుల్ఐటీ సిబ్బంది రేఖను హుటాహుటీన చికిత్స నిమిత్తం ట్రిపుల్ఐటీలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రేఖ అదే రోజు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మృతి చెందింది. ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి మరో పదిరోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడటం కలకం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ఐటీ డైరెక్టర్ కుమారస్వామిగుప్త, హాస్టల్ సంక్షేమాధికారి ఇమ్రాన్షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు విద్యార్ధిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతురాలు రేఖ మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.