Amaravati lands: అమరావతి భూముల్లో నో ఇన్ సైడర్.. ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
Amaravati Lands Row:
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఏపీ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటీషన్ కొట్టి వేసింది సుప్రీం కోర్టు. దీనంతటికీ కారణం.. ఒకటే రాజధాని భూముల వ్యవహారమంతా బహిరంగంగా జరిగింది. ఏ ఒక్కరూ విబేధించలేదు. భూములు అమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారు తప్పించి.. భూములు అమ్మిన వాళ్లెవరూ కంప్లయింట్ చేయలేదు. అలాంటపుడు విచారణ ఎందుకు జరపాలి అన్నది ప్రతివాద న్యాయవాదుల వాదన.
అయితే ప్రభుత్వం తరఫున వాదించిన దుష్యంత్ దవే- మాత్రం ఇందుకు భిన్నమైన వాదనలు వినిపించారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం- 55 ప్రకారం ఇది నేరపూరితమని అన్నారు. ఈ కేసు ప్రాధమిక విచారణ దశలో ఉండగానే ఏపీ హైకోర్టు అడ్డుకుంది. కాబట్టి.. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు కొట్టేయాలని కోరారు. ఈ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలున్నాయి. భూముల కొనుగోళ్లు- అమ్మకాల్లో అనేక లోటుపాట్లున్నాయి. కాబట్టి ఈ కేసును ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టానికి అనుగుణంగా విచారణ చేయించాల్సి ఉందని వాదించారు దవే. ఈ విషయంపై 2014- 2019 వరకూ ఎవ్వరూ కంప్లయింట్ చేయలేదు. 2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులందాయని కోర్టుకు విన్నవించారు ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే.
ఈ అంశంపై ప్రతివాద న్యాయవాదులు సైతం అంతే స్థాయిలో తీవ్రంగా విబేధించారు. 2014 అక్టోబర్ నుంచే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో మీడియాలో వచ్చింది. కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు.. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైంది. రాజధాని వ్యవహారమంతా బహిరంగంగానే జరిగింది కాబట్టి ఇందులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టానికి తావు లేదన్నది ప్రతివాద న్యాయవాది ఖుర్షిద్ వినిపించిన వర్షెన్.
మరో ప్రతివాద న్యావాది శ్యామ్ దివాన్ మరికొన్ని పాయింట్లు ఇందుకు జోడించారు. రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించింది. ఆ తర్వాతే తీర్పునిచ్చింది. స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదు. కాబట్టి.. ఇక్కడసలు సమస్యే లేదని అన్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న జస్టిస్ వినిత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం జూలై 19న సుదీర్ఘ విచారణ చేసింది. ప్రభుత్వ పిటిషన్ కొట్టేసింది.