Myanmar: మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?
భూకంపాలకు భూమ్మీద తేలియాడుతున్నట్టుగా ఉండే 'టెక్టానిక్' ఫలకాల కదలికలే కారణమని ఎవరిని అడిగినా చెబుతారు. తుఫాన్లు, వరదలు, వర్షాభావ పరిస్థితులు సహా ప్రకృతికి సంబంధించి ఎన్నో విషయాలను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానం మానవాళికి సొంతమైనప్పటికీ.. భూకంపాల విషయంలో ముందుగా పసిగట్టే పరిజ్ఞానం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు.

భూకంపాలకు భూమ్మీద తేలియాడుతున్నట్టుగా ఉండే ‘టెక్టానిక్’ ఫలకాల కదలికలే కారణమని ఎవరిని అడిగినా చెబుతారు. తుఫాన్లు, వరదలు, వర్షాభావ పరిస్థితులు సహా ప్రకృతికి సంబంధించి ఎన్నో విషయాలను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానం మానవాళికి సొంతమైనప్పటికీ.. భూకంపాల విషయంలో ముందుగా పసిగట్టే పరిజ్ఞానం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. భూగోళాన్ని పరిశీలిస్తే.. లోపలి నుంచి పొరలు పొరలుగా ఉంటుంది. మొత్తం భూగోళానికి మధ్యలో ఇన్నర్ కోర్ 1,300 కి.మీ వ్యాసార్థంతో ఉండగా, దానిపై ఔటర్ కోర్ 2,250 కి.మీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 4,000 – 9,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇనుము, నికెల్ వంటి ఖనిజాలు చిక్కని ద్రవరూపంలో ఉంటాయి. ఈ కోర్ మీద ఉండేదే మ్యాంటిల్. ఇది కరిగి ద్రవరూపంలో ఉన్న రాళ్లు, ఇతర పదార్థాలను కలిపి ‘మాగ్మా’గా పిలుస్తారు. ఇది 2,900 కి.మీ మందంతో భూమి లోపలి పొరలు ‘కోర్’పై విస్తరించి ఉంటుంది. దీనిపై పరుచుకుని ఉండి పైకి కనిపించేదే క్రస్ట్. ఈ క్రస్ట్ 0-60 కి.మీ మందంతో భూమిపై విస్తరించి ఉంటుంది. ఎక్కడైతే ఈ పొర మందం తక్కువగా ఉంటుందో అక్కణ్ణుంచి లోపలి పొరలో ఉండే మాగ్మా బయటికి తన్నుకొస్తూ అగ్నిపర్వతాలను ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రస్ట్ భూమి లోపలి పొరల్లో చిక్కటి ద్రవరూపంలో ఉన్న ‘మ్యాంటిల్’పై తేలియాడుతూ ఉంటుంది. ఆ క్రస్ట్ను పలు టెక్టానిక్ ప్లేట్లుగా విభజించవచ్చు. అంటే టెక్టానిక్ ప్లేట్లు అన్నీ కలిపితే భూమి పైపొర క్రస్ట్ అని అర్థం చేసుకోవచ్చు.
భూ పరిభ్రమణాలు, భూ గురుత్వాకర్షణతో పాటు సౌర కుటుంబం, ఇతర విశ్వంలోని గురుత్వాకర్షణ బలాల ప్రభావంతో భూమి పైపొరగా టెక్టానిక్ ప్లేట్ల కదలికలకు కారణమవుతుంటాయి. మిలియన్ల సంవత్సరాల క్రితం భూగోళంపై భూమి, సముద్రం ఇప్పుడున్నట్టుగా లేవు. అప్పట్లో భూభాగమంతా ఒకేచోట కలసిపోయి ఉండగా, సముద్రమంతా మిగతా ప్రాంతమంతా పరచుకుని ఉండేది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో భాగంగా ఆఫ్రికా ఖండానికి సమీపాన ఉన్న భారత టెక్టానిక్ ప్లేట్ ఉత్తరదిశగా కదులుతూ వచ్చి యురేషియన్ (యూరప్+ఆసియా) టెక్టానిక్ ప్లేట్కు ఢీకొట్టింది. ఢీకొట్టే క్రమంలో యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ కిందికి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ చొచ్చుకుపోతోంది. ఆ కారణంగానే రెండు టెక్టానిక్ ప్లేట్లు కలిసిన ప్రాంతం నానాటికీ పైకి లేస్తూ హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అందుకే హిమాలయాలు ఏటా 8 సెం.మీ ఎత్తు పెరుగుతూ పోతున్నాయి. భారీ భూకంపాలకు కూడా కారణమవుతున్నాయి. పశ్చిమాన ఇరాన్ – అప్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ వరకు విస్తరించిన హిందూకుష్, కారకోరం, హిమాలయన్ రేంజ్ పర్వత ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవించేందుకు ఈ టెక్టానిక్ ప్లేట్ కదలికలే కారణమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫాల్ట్ లైన్స్ —————————
టెక్టానిక్ ప్లేట్లు భూగోళం అంతటా ఒకేలా కదలడం లేదు. ఇండియన్ – యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ల విషయంలో ఒకదాని కిందకు మరొకటి చొచ్చుకుపోతుండగా.. కొన్ని చోట్ల దూరంగా జరిగిపోతున్న టెక్టానిక్ ప్లేట్లు కూడా ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో తూర్పు భాగం ఒక టెక్టానిక్ ప్లేట్ పరిధిలో ఉండగా, మిగతా భాగం మరో టెక్టానిక్ ప్లేట్ మీద ఉంది. ఈ రెండూ దూరమవుతూ మధ్యలో సముద్రాన్ని సృష్టించబోతున్నాయి. ఇది జరిగేందుకు కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉత్తర అమెరికా ఖండంలో పశ్చిమాన కాలిఫోర్నియా ఒక టెక్టానిక్ ప్లేట్పై ఉండగా, మిగతా ప్రాంతం మరో టెక్టానిక్ ప్లేట్పై ఉంది. ఈ రెండు టెక్టానిక్ ప్లేట్ల కదలిక మరో రకంగా ఉంది. ఒక ప్లేట్ పైకి ఉత్తరదిశగా కదులుతుండగా.. మరో ప్లేట్ దక్షిణ దిశగా కిందికి కదులుతోంది. దీంతో ఇక్కడ ప్లేట్ల మధ్య ఘర్షణ ఏర్పడి భూకంపాలకు ఆస్కారం కల్గిస్తున్నాయి. ఈ అంశంపై హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి.
ఈ టెక్టానిక్ ప్లేట్లు కలిసిన ప్రాంతాలను “ఫాల్ట్ లైన్” అంటారు. అలాంటి ఫాల్ట్ లైన్స్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి మయన్మార్ దేశం మీదుగా 1,200 కి.మీ పొడవునా ఉంది. సగైంగ్ ఫాల్ట్ (Sagaing Fault) గా పిలిచే ఆ భూకంప రేఖ తాజాగా జరిగిన భారీ భూకంపానికి కారణమైంది. ఈ ఫాల్ట్ ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దుగా ఉంది. తాజాగా ఏర్పడ్డ భూకంపాలు “స్ట్రైక్-స్లిప్” రకానికి చెందినవి. అంటే రెండు టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి అడ్డంగా జారడం వల్ల సంభవిస్తాయి. ఇండియన్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ యురేషియన్ ప్లేట్తో ఘర్షణకు గురవుతుంది, దీని ఫలితంగా ఒత్తిడి పెరిగి ఆ శక్తి భూకంప రూపంలో విడుదలవుతుంది. ఈ ఘర్షణ సాగైంగ్ ఫాల్ట్ వెంబడి జరుగుతుంది. గతంలో కూడా అనేక పెద్ద భూకంపాలకు కారణమైంది (ఉదాహరణకు, 1946లో 7.7 తీవ్రత, 2012లో 6.8 తీవ్రత).
మార్చి 28, 2025న సంభవించిన భూకంపం 7.7 తీవ్రతతో, కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. లోతు తక్కువ ఉన్న భూకంపాలు (షాలో ఎర్త్క్వేక్స్) ఉపరితలంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. భవనాలు, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ భూకంప ప్రభావం మయన్మార్లోని సగైంగ్ ప్రాంతంలో కేంద్రీకృతమై, థాయ్లాండ్లోని బ్యాంకాక్ వరకు కంపనాలు వ్యాపించాయి. ఈ ప్రాంతంలో భూకంపాలు సాధారణమైనప్పటికీ, సగైంగ్ ప్రాంతంలో ఇంత పెద్ద తీవ్రత గల భూకంపాలు అరుదు. గత 100 ఏళ్లలో ఈ రీజియన్లో 7.7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు కేవలం మూడు సార్లు మాత్రమే సంభవించాయి. అంతేకాక, ఈ ప్రాంతంలోని నిర్మాణాలు భూకంపాలను తట్టుకునేలా లేకపోవడం వల్ల నష్టం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.