UKRAINE-RUSSIA WAR: రష్యా, యుక్రెయిన్ వివాదంలోకి ప్రధాని మోదీ.. టెలిఫోనిక్ సంభాషణలతో శాంతి సమాలోచనలకు ఛాన్స్?
యుక్రెయిన్పై రష్యా యుద్దాన్ని ప్రారంభించి 11 రోజులైపోయింది. మధ్యలో మానవీయ కోణంలో మూడుసార్లు కాల్పుల విరమణ ప్రకటించినా..
UKRAINE-RUSSIA WAR TURNING INTO PEACE NEGOTIATIONS WITH MODI INITIATION: యుక్రెయిన్పై రష్యా యుద్దాన్ని ప్రారంభించి 11 రోజులైపోయింది. మధ్యలో మానవీయ కోణంలో మూడుసార్లు కాల్పుల విరమణ ప్రకటించినా.. యుద్దం ముగింపు దిశగా ఇరు దేశాలు కూడా అడుగులు వేయకపోవడం యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. దానికితోడు నాటో దళాల కవ్వింపు చర్యల కారణంగా రష్యా ఎలాంటి విపరీత నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్దం కాస్తా అణుయుద్దంగా మారితే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యుక్రెయిన్లో వున్న మూడు అణు విద్యుత్ కేంద్రాలపై రష్యన్ మిలిటరీ ఇదివరకే పట్టు సాధించింది. ముందుగా యుక్రెయిన్ ఉత్తర భాగాన బెలారుస్ సరిహద్దుకు సమీపంలో వున్న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది రష్యాన్ ఆర్మీ. ఏనాడో మూసేసిన.. అసలే యాక్టివ్గా లేకుండా రేడియేషన్ ఇంకా కొనసాగుతున్న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా ఎందుకు స్వాధీనం చేసుకుంది? ఈ ప్రశ్న చాలా నోళ్ళలో వినిపించింది. చెర్నోబిల్ స్వాధీనం తర్వాత కీవ్ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది రష్యాన్ ఆర్మీ. అంతకు ముందే తూర్పు యుక్రెయిన్ భాగంలోని డాన్ బాస్ ప్రాంతంపై పట్టు సాధించింది. అదే ఏరియాలో రెండు స్వతంత్ర దేశాలను ప్రకటించేసింది. అయితే.. డాన్ బాస్ ప్రాంతానికి చేరువలోను, రష్యా సరిహద్దుకు కేవలం 50 కిలో మీటర్ల దూరంలోను వున్న యుక్రెయిన్ వాణిజ్య రాజధాని ఖార్కీవ్ నగరంలో రష్యా విధ్వంసమే సృష్టించింది. జనావాస ప్రాంతాలను సైతం వదలకుండా బాంబుల వర్షం కురిపించింది. ఖార్కీవ్ నగరాన్ని దాదాపు నేలమట్టం చేసింది.
యుక్రెయిన్ దక్షిణ భాగంలో వున్న ఒడెస్సా అనే తీరప్రాంత నగరాన్ని సైతం రష్యా లక్ష్యంగా చేసుకుంది. యుద్దం ప్రారంభించిన తొలి రోజుల్లో ఒడెస్సాలోని నేవల్ బేస్ని ధ్వంసం చేసిన రష్యా ఆ తర్వాత వారం రోజులు ఒడెస్సా వైపు పెద్దగా దృష్టి సారించలేదు. కానీ మార్చి 5, 6 తేదీల్లో ఒడెస్సా నగరమే లక్ష్యంగా రష్యా దాడులు ముమ్మరం చేసింది. అందుకు కారణం ఆల్ రెడీ తమ స్వాధీనంలో వున్న క్రిమియాతో యుక్రెయిన్కు పూర్తి స్థాయిలో సంబంధాలు తెగగొట్టేయడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా కొనసాగుతుండగానే జఫ్రోజియాలోని అణు విద్యుత్ కేంద్రమే లక్ష్యంగా బాంబులను ప్రయోగించింది రష్యా మిలిటరీ. అదృష్టవశాత్తు ఆ బాంబు దాడిలో యాక్టివ్గా లేని రియాక్టర్ పేలిపోయి మంటలు మాత్రమే వ్యాపించాయి. అవే బాంబులు గనక అణు విద్యుత్ కేంద్రంలో యాక్టివ్గా వున్న న్యూక్లియర్ రియాక్టర్లపై పడితే మాత్రం జఫ్రోజియా ఏరియా మరో చర్నోబిల్ లాగా మారిపోయేదనడంలో సందేహమే లేదు. ఈ క్రమంలో రష్యా వ్యూహాన్ని పలు రకాలుగా అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు.
నిజానికి అత్యంత బలోపేతంగా వుండే రష్యా మిలిటరీని యుక్రెయిన్ ఎంతమాత్రం నిలువరించలేదని తొలుత అంతా భావించారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా యుక్రెయిన్కు మద్దతుగా నాటో దళాలు రంగంలోకి దిగకపోతే.. ఆ దేశాన్ని రెండు, మూడు రోజుల్లో లొంగదీసుకోవచ్చని భావించారు. కానీ.. యుక్రెయిన్ అందరి అంచనాలను తల్లకిందులు చేసింది. మార్చి 7వ తేదీ నాటికి పదకొండు రోజుల పాటు రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటూ వచ్చింది. పది వేల మంది వరకు రష్యన్ సైనికులను మట్టుబెట్టామని యుక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యన్ సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలోని కీలక నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఎనర్హోదర్ నగరంలోని అణు విద్యుత్తు కేంద్రం జప్రోజియాపై దాడిచేసింది. దీంతో అణువిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. యూరప్ ఖండంలోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రం జప్రోజియా ఎన్పీపీపై రష్యా బలగాలు దాడిచేశాయి. ఒకవేళ అది పేలినట్లయితే.. చెర్నోబిల్ పేలుడు కంటే పది రెట్లు భారీ నష్టం ఉంటుందని కులేబా ట్విటర్ ద్వారా తెలిపారు.
రష్యా దళాలు పవర్ ప్లాంట్ను చుట్టుముట్టాయని, బిల్డింగ్పై అన్ని వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారని, దీంతో అందులో మంటలు చెరలేగాయన్నారు. రష్యా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, ఫైర్ ఫైటర్లను సెక్యూరిటీ జోన్లోకి అనుమతించాలని సూచించారు. జప్రోజియా అణువిద్యుత్ కేంద్రం వద్ద ప్రస్తుతం పరిస్థితులపై ఉక్రెయిన్ ప్రధాని, ఉక్రేనియన్ న్యూక్లియర్ రెగ్యులేటర్, ఆపరేటర్తో మాట్లాడినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫైల్ మారియానోగ్రొస్సి చెప్పారు. రియాక్టర్ పేలితే భారీ ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెంటనే బలగాలను ఉపసంహరించుకోవాలని, దాడులను ఆపాలని కోరారు. ఈ మేరకు ఐఏఈఏ ట్వీట్ చేసింది. రియాక్టర్ సమీపంలో పేలుళ్లు జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం మంటల్ని ఆర్పినట్లు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ శాఖ తెలిపింది. ఘటన తర్వాత అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ, అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్ అధికారులతో టచ్లో ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఒకవేళ మంటల్ని ఆర్పకుంటే అప్పుడు ఆ అణు కేంద్రం పూర్తిగా ధ్వంసం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ న్యూక్లియర్ సెక్యూర్టీ ఎక్స్పర్ట్ గ్రహమ్ అలిసన్ తెలిపారు. అదే కనుక జరిగితే కొన్నేళ్ల పాటు ఆ ప్రాంతంలో రేడియోయాక్టివిటీ ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్లో ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ తక్కువగా ఉండి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సమీప ప్రాంతాలకు ఈ ప్లాంట్ నుంచే విద్యుత్తు శక్తి అందుతుంది. అందుకే రష్యా దళాలు ఆ ప్లాంట్ను మూసివేయాలని భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవల్స్లో మార్పులేదని శాస్త్రవేత్తలు తెలిపారు. జపోరియా అణు కేంద్రం.. ఉక్రెయిన్ దేశానికి నాలుగో వంతు విద్యుత్తును అందిస్తోంది. అతిపెద్ద అణు కేంద్రం మంటల్లో ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. తన ట్విట్టర్లో వీడియో పోస్టు చేసిన జెలెన్స్కీ.. రష్యన్లు కావాలనే ఆ ప్లాంట్పై ఫైరింగ్ జరిపినట్లు తెలిపారు. ‘‘యూరప్ ప్రజలారా మేల్కోండి.. రష్యా బలగాలు న్యూక్లియర్ ప్లాంట్ను షూట్ చేసినట్లు మీ రాజకీయ నేతలకు చెప్పండి’’ అంటూ తన వీడియోలో జెలెన్స్కీ కోరారు. న్యూక్లియర్ ప్లాంట్పై దాడిపై భగ్గు మంటున్నాయి ప్రపంచ దేశాలు. న్యూక్లియర్ విస్పోటనంపై ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. రష్యా సైనికుల తీరును తీవ్రంగా ఖండించింది అంతర్జాతీయ అణు ఇంధన సరఫరా సంస్థ. న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు ఆపక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అయితే రియాక్టర్లకు ప్రమాదం జరుగలేదని తేల్చింది ఇంటర్నేషనల్ అటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ముందు నుంచే న్యూక్లియర్ బాంబ్ వేస్తామంటూ చేసిన వార్నింగ్స్ ఇప్పుడు నిజమేననిపిస్తోంది. పుతిన్ చేస్తున్న ఇలాంటి విధ్వంస రచనతో ప్రపంచం హై అలర్ట్ అయ్యింది. చరిత్రలో ఇంతవరకూ ఏ దేశాధినేతా చెయ్యని దాడి పుతిన్ చేసి.. ప్రంపాచినికే సవాల్ విసురుతున్నారు. ఉక్రెయిన్పై అణుబాంబు వెయ్యకపోయినా, అంతటి స్థాయి విధ్వంసానికే ఆరంభం పలికారు. దేశానికి 40 శాతం న్యూక్లియర్ పవర్ను అందిస్తున్న జఫ్రోజియా న్యూక్లియర్ ప్లాంట్పై తెగబడింది రష్యా. ఆ ప్లాంట్పై వరుస దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే మంటల్లో చిక్కుకుంది పవర్ ప్లాంట్. ఇక్కడ ఉన్న 6 న్యూక్లియర్ రియాక్టర్లో 4 రియాక్టర్లు రన్నింగ్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు జెలెన్స్కీ రష్యాతో యుద్ధమే చెయ్యాలా… ఉక్రెయిన్ సహా పొరుగు దేశాలనూ కాపాడేలా పవర్ ప్లాంట్ను కాపాడుకోవాలా.. అన్నట్లుంది పరిస్థితి.
మరో వైపు జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్పై జరిగిన దాడిపై ఇంటర్నేషనల్ అటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ స్పందించింది. రష్యా దాడి తర్వాత పరిస్థితిని అంచనా వేసిన సంస్థ.. రియాక్షన్ లెవల్స్లో మార్పులు రాలేదని.. భద్రతపరంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నామని ట్వీట్ చేసింది. రష్యా బాంబు దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ. న్యూక్లియర్ ప్లాంట్పై దాడి జరగడం చరిత్రలోనే మొదటి సారని అన్నారు. న్యూక్లియర్ ప్లాంట్లు ధ్వంసం అయితే.. యూరప్కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్లో 15 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. టోటల్గా వార్ సీన్ను మరో లెవల్కి తీసుకెళ్లింది రష్యా .ఇప్పటి వరకు నగరాలను టార్గెట్ చేసిన రష్యా దళాలు.. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ ప్లాంట్పైనే మిస్సైల్స్తో దాడి చేశాయి. ఉక్రెయిన్లో అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఐన జప్రోజియాపై పలు మార్లు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. అక్కడ జరిగిన నష్టంపై మాత్ర ఎలాంటి సమాచారం రావడంలేదు. ఒక వేళ.. న్యూక్లియర్ ప్లాంట్పై జరిగిన దాడిలో.. ఏదైనా జరుగరానిది జరిగితే.. ఆ నష్టం ఊహలకే అందదంటున్నారు నిపుణులు. ప్రాణ నష్టంతో పాటు.. న్యూక్లియర్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. హిరోషిమా, నాగసాకిల విధ్వంసానికి మించిన నష్టం జరుగుతుందంటున్నారు. చెర్నోబిల్ విషాదానికి 10రెట్లకు మించి ఉంటుందని అంటున్నారు.
ఇదిలా వుంటే మార్చి 7వ తేదీన రష్యా, యుక్రెయిన్ యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం యుద్ద విరమణ దిశగా అడుగులు పడే సంకేతాల్నిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు. మార్చి 7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. చర్చల ద్వారా రష్యాతో విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ దేశంలో వున్న భారతీయుల సేఫ్ ప్యాసేజ్కు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఏకంగా 50 నిమిషాల పాటు మోదీ టెలిఫోనిక్ సంభాషణ జరిపారు. యుద్ద విరమణ దిశగా చర్చలకు తెరలేపాలని, ప్రపంచ శాంతి అన్నింటికంటే ముఖ్యమని పుతిన్కు మోదీ సూచించారు. ఆది నుంచి భారత్కు అండగా వుంటూ వస్తున్న రష్యాను నొప్పించక తానొవ్వక అన్న రీతిలో మోదీ చర్చలకు దిశగా అడుగులు వేయాలని సూచించడంపై పలు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరపాలంటూ మోదీ చేసిన ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే మార్చి 7న యుక్రెయిన్, రష్యాల మధ్య మూడో విడత చర్చలు జరుగుతున్నాయి. వాటి ఫలితం తేలిన తర్వాతనే మోదీ ప్రతిపాదించిన జెలెన్స్కీ, పుతిన్ భేటీ దిశగా అడుగులు పడతాయని భావిస్తున్నారు. ఇటు చిరకాల మిత్ర దేశం రష్యా.. మరోవైపు తమ భూభాగాన్ని రక్షించుకోవడంలో ఎనలేని ప్రతిఘటనను ప్రదర్శిస్తున్న యుక్రెయిన్.. ఇలా భారత దేశం ఒకింత సంక్లిష్టమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మార్చి 7న మోదీ చూపిన చొరవ యుద్ద విరమణ దిశగా అడుగులు వేయిస్తే.. ప్రపంచ శాంతిలో తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించిన ఘనత మన దేశానికి దక్కుతుంది.