Sri Lanka: రోజురోజుకు ముదురుతున్న లంక సంక్షోభం.. నేటి నుంచి పాఠశాలలూ మూసివేత

శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. నిత్యావసరాలు, ఇంధనం వంటివి వేగంగా అడుగంటిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సింహళ దేశానికి పలు విదేశాలు సహాయం చేస్తున్నప్పటికీ..

Sri Lanka: రోజురోజుకు ముదురుతున్న లంక సంక్షోభం.. నేటి నుంచి పాఠశాలలూ మూసివేత
Srilanka Crisis
Follow us

|

Updated on: Jun 20, 2022 | 5:51 PM

శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. నిత్యావసరాలు, ఇంధనం వంటివి వేగంగా అడుగంటిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సింహళ దేశానికి పలు విదేశాలు సహాయం చేస్తున్నప్పటికీ.. అవి స్థానికంగా నెలకొన్న అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో వాటిని ఆదా చేసేందుకు అత్యవసరం కాని సేవలను రెండు వారాలపాటు నిలిపివేసింది. ఇవాల్టి (సోమవారం) నుంచే ఈ విధానంలో అందుబాటులోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా స్కూల్స్ మూతపడ్డాయి(Schools Bandh in Sri Lanka). ప్రభుత్వ కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పనిచేస్తున్నాయి. అయితే.. పెట్రోల్‌ బంక్ ల వద్ద పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. కాగా.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అధ్యక్ష సచివాలయ కీలక ద్వారాలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి అత్యంతదారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 50 బిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపుల తేదీలను పొడిగించాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా భారత్‌ సాయం చేస్తోంది. జులై నుంచి నాలుగు నెలల పాటు ఇంధన కొనుగోళ్లకూ క్రెడిట్‌ లైన్‌ ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైందని లంక ప్రధాని విక్రమసింఘే ఇటీవల వెల్లడించారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంక్‌ల వద్ద గంటలకొద్దీ వెయిట్‌ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో కార్మికులకు ఉపాధి కరువైంది. నాలుగైదు రోజుల్లో పెట్రోల్‌ షిప్‌మెంట్లు వస్తాయని శ్రీలంక ఆశిస్తోంది. అవి వచ్చినా ఓ మూలకు కూడా సరిపోవని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విదేశీ మారక ద్రవ్యానికి తీవ్ర కొరత ఉండటంతో ఆహార ధాన్యాలు, ఇంధనం, ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక నానాపాట్లు పడుతోంది. భారత్‌తో పాటు పలు దేశాలను సహాయం చేయాలని అభ్యర్థిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంకలో మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి