AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: మరింత దిగజారిన శ్రీలంక పరిస్థితి.. ఆకలితో అల్లాడుతున్న లంకేయులకు భారత్‌ ఆపన్నహస్తం!

దాదాపు 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి అత్యంత ఘోరమైన దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Sri Lanka Crisis: మరింత దిగజారిన శ్రీలంక పరిస్థితి.. ఆకలితో అల్లాడుతున్న లంకేయులకు భారత్‌ ఆపన్నహస్తం!
Sri Lanka Economic Crisis
Balaraju Goud
|

Updated on: Apr 02, 2022 | 8:08 PM

Share

Sri Lanka Economic Crisis: శ్రీలంక ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. తినడానికి తిండిలేదు.. రోగం వస్తే మందుల్లేవు.. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటడం, కాగితం కొరతతో పరీక్షలు వాయిదా, డీజిల్‌ విక్రయాల నిలిపివేత, 13 గంటల పాటు కరెంట్‌ కోతలు.. చాలా దీనంగా మారింది లంకేయుల పరిస్థితి. రోడ్డెక్కిన జనం ఆందోళనలు, నిరసనలు మిన్నంటడంతో సోమవారం వరకు కర్ఫ్యూ విధించారు. 40 వేల టన్నుల డీజిల్‌తో పాటు భారీగా బియ్యాన్ని పంపించి శ్రీలంకకు ఆపన్నహస్తం అందించింది భారత్‌.

దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న వేళ దేశవ్యాప్తంగా శనివారం అత్యవసర పరిస్థితి విధిస్తూ గొటబాయ రాజపక్స గెజిట్‌ విడుదల చేశారు. భద్రతా దళాలకు విస్తృత అధికారులు ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజా భద్రత, రక్షణతో పాటు ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరా, సేవల నిర్వహణ కొనసాగేందుకు ఎమర్జెన్సీ విధించినట్టు గొటబయ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 నుంచే ఎమర్జెన్సీ అమలులోకి వచ్చినట్టు గెజిట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటడంతో సోమవారం వరకు దేశమంతా కర్ఫ్యూ విధించారు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు. రాజధాని కొలంబోతో సహా దేశమంతా సైన్యం పహారా కాస్తోంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం అందించింది. ప్రత్యేక నౌకలో 40వేల టన్నుల డీజిల్‌ను లంకకు పంపించింది. . బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్‌ను ద్వీప దేశానికి అప్పుగా సరఫరా చేసింది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శ్రీలంకకు చేరుకుంది.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ.. ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనుంది. శ్రీలంక రవాణారంగంలో బస్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో మూడింటా రెండొంతుల వాహనాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వాటికి సరిపడా డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో రాజపక్స ప్రభుత్వం భారత్‌ సాయం కోరింది.డీజిల్‌తో పాటు శ్రీలంకకు భారీగా బియ్యాన్ని కూడా పంపిస్తోంది భారత్. 40 వేల టన్నుల బియ్యాన్ని లంకకు అందించాలని భారత్‌ నిర్ణయించింది. శ్రీలంకను ఆహర సంక్షోభంతో పాటు ఇంధన సమస్య కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసింది. విదేశీ మారకద్రవ్యం జీరో అయ్యింది. విదేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకునే పరిస్థితిలో శ్రీలంక లేదు. ఈ సమయంలో భారత్‌ ఆదుకుంది. అప్పుల ఊబి నుంచి కోలుకోలేకపతోంది శ్రీలంక . ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశ ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఎమర్జెన్సీ విధించారు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే.

దాదాపు 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి అత్యంత ఘోరమైన తిరోగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అత్యవసరమైన వస్తువుల దిగుమతులకు సైతం విదేశీ కరెన్సీ కొరత ఉండటంతో పరిస్థితులు మరింత క్షీణించాయి.

Read Also…  Pakistan Crisis: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ కీలక నిర్ణయం.. ఏం చేయబోతుందో తెలుసా?